- 69 సంవత్సారల తరవాత తిరిగి సొంతగూటికి సంస్థ
- ప్రధాని మోడీతో టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
న్యూ దిల్లీ, జనవరి 27 : ఎయిరిండియాను టాటా గ్రూప్నకు అప్పగించే పక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ ‘మహారాజా’ను ఇక పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గురువారం ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకాలు చేసింది.
టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతుంది. ఎయిరిండియా 101 డెస్టినేషన్స్కు విమానాలను నడుపుతున్నట్లు 2020నాటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తుంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తుంది. ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల అనంతరం తిరిగి టాటా గ్రూప్ స్వాధీనం కాబోతున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం సమావేశమయ్యారు. అంతకుముందు కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం ఎయిర్లైన్స్ హౌస్కు చేరుకున్నారు. ఎయిరిండియా దాదాపు 69 సంవత్సరాల తర్వాత గురువారం అధికారికంగా టాటా గ్రూప్ స్వాధీనం కాబోతుంది.