- బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపిలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం
- పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడంపై ఆగ్రహం
పార్లమెంటు సమావేశాలను జరక్కుండా అడ్డుకుంటున్న విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారంనాడు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, పార్లమెంటు ప్రొసీడింగ్స్కు సంబంధించిన ఏ సమావేశంలోనూ విపక్షాలు పాల్గొనకపోవడం, ఉభయసభల కార్యక్రమాలను జరక్కుండా అడ్డుకోవడం వంటి చర్యలను ప్రజల దృష్టికి తేవాలని ఎంపీలకు సూచించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు చర్చకు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.
పెగాసస్ స్నూపింగ్ వివాదం, సాగు చట్టాలు, తదితర అంశాలపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఉభయసభలనూ జరగనీయకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో మోదీ తాజా స్పందన చోటుచేసుకుంది. ఈనెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలూ ప్రతిరోజూ పలుమార్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. కాగా, 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామగ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ప్రధాని సూచించారు. 75 స్వాంతంత్య్ర వార్షికోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా, ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రధాని సూచించినట్టు సమావేశానంతరం వి•డియాతో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.