కానీ బాగుపడ్డది కల్వకుంట్ల కుటుంబమే : పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి
ఎన్నో పోరాటాల ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం వొచ్చిందని.. అయితే ఇది కొంత మంది చేతుల్లోనే మగ్గిపోతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీయే ఇస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను తగ్గించిన టిఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని సూచించారు. హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ ఫిషర్మెన్ ఛైర్మన్గా మెట్టు సాయి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. సరైన ఉద్యోగవకాశాలు వస్తాయని మంచి జీవితం గడుపుతామని అనుకున్నారు. కానీ వారి ఆశలను అధికార పార్టీ నిరాశకు గురి చేసిందన్నారు. ఇప్పుడు ప్రజలు టీఆర్ఎస్ సర్కార్ ను ద్వేశిస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపిలకు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు పెట్రోల్ ధరలను వంద రూపాయలకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.