- జడ్జీల భద్రత, కోర్టుల్లో సెక్యూరిటీపై సమిక్షకు సంసిద్ధత
- ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడిన సిజెఐ
ఢిల్లీలోని రోహిణి కోర్టు దగ్గర శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వి రమణ సీరియస్గా తీసుకున్నారు. రోహిణి కోర్టులో ఇలాంటి ఘటన జరగడాన్ని చీఫ్ జస్టిస్ రమణ తీవ్రంగా పరిగణించారు. జడ్జీల భద్రత, కోర్టుల్లో సెక్యూరిటీపై వొచ్చేవారమే విచారణ జరపాలని సుప్రీమ్ కోర్టు భావిస్తుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించాలనుకున్నప్పటికీ…సెక్యూరిటీ కారణాలతో ఆగిపోయారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడారు. జార్ఖండ్ లో జడ్జ్ హత్యపై విచారణ జరుగుతుండగానే రోహిణి ఘటనజరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రోహిణీ కోర్టు షూటౌట్కు సంబంధించి కలగజేసుకోవాలని లాయర్ విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. రోహిణి కోర్టు తరహా ఘటనలు కొత్తేమికాదని తెలిపారు.
బిజ్నోర్, బర్వానీ, అమృత్ సర్, హిసార్ సహా అనేక ప్రాంతాల్లోని కోర్టుల్లో కాల్పులు జరిగాయన్నారు. ఇలాంటి ఘటనలతో…జడ్జీలు, లాయర్లకు మాత్రమే కాకుండా న్యాయం కోసం కోర్టుకు వొచ్చేవారికి కూడా ప్రమాదం ఉందన్నారు. అందుకే కరుడుగట్టిన నేరస్థులను కోర్టులకు తీసుకురాకుండా… వర్చువల్ గా విచారించాలని పిటిషన్లో కోరారు. కిందిస్థాయి కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కోర్టుల్లో సేప్టీ, సెక్యూరిటీ పెంచేలా ఆర్డర్స్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలైంది. కాల్పుల ఘటనతో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు…రోహిణీ కోర్ట్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు గ్యాంగ్స్టర్ జితేందర్ మన్ గోగీ హత్య నేపథ్యంలో… జైళ్లలో గ్యాంగ్ వార్ జరగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే తిహార్, మండోలీ, రోహిణీ జైళ్లలో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ రాకేశ్ షెరావత్ కొందరు అధికారులతో కలసి ఢిల్లీ పోలీస్ కమిషనర్తో సమావేశమయ్యారు.