- బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి
- సభ్యులుగా 6 గురు బాధ్యతలు స్వీకరణ
- కార్యక్రమానికి హాజరైన మంత్రి కెటిఆర్
రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ, కుమ్ర ఈశ్వరీబాయి, సూదం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డితో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
సునీత భర్త లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా గోమారం సర్పంచ్తోపాటు శివ్వంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. మెదక్ జిల్లా రైతుసంక్షేమం సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సునీత మామ రామచంద్రారెడ్డి 25 ఏండ్లపాటు సర్పంచ్గా, శివ్వంపేటకు ఎంపీపీగా పనిచేశారు. వీరి వారసురాలిగా సునీత 1999లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.