- ఓ వైపు కొత్త హాస్పిటల్స్ నిర్మాణం..మరోవైపు ఆధునీకరణ
- రూ.10.84 కోట్లతో దవాఖానాలకు మరమ్మతులు
- రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రంలో కొత్తగా మరో 20 బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోటి రూ.12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఓవైపు కొత్త హాస్పిటల్స్, మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు ఉన్న హాస్పిటల్స్ను ఆధునీకరణ చేసే పక్రియ కొనసాగుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. ఇందులో భాగంగా లేబర్ రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇతర అన్నిరకాల మరమ్మత్తులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొరోనా, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ అంశాలపై సోమవారం మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యారోగ్య శాఖ మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.10.84 వ్యయం చేయనున్నట్లు చెప్పారు. 14 జిల్లాల పరిధిలోని 4 జిల్లా దవాఖానాలు, 8 ఏరియా హాస్పిటళ్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. ఈ జాబితాలో నల్గొండ, భదాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. కాగా, కొరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం సత్వరమే పూర్తి చేసేలా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి
కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖరాశారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులు రెండేళ్ల బకాయిలు రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ సూచించిన మేరకు రూ.24.05 కోట్లను విడుదల చేయాలని లేఖలో కారారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. 2019తో పోలిస్తే 2021లో రాస్ట్రానికి పన్నుల వాటా తగ్గుతుందనీ, ఈమేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15 వ ఆర్థిక సంఘం సూచించిందనీ, అయినప్పటికీ ఈ నిధులు కూడా విడుదల కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలలో తెలంగాణకు బదులు పొరపాటున ఏపీకి విడుదల చేసిన రూ.495.20 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు,.. అందువల్ల ఈ మొత్తాన్ని వెంటనే సర్దుబాటు చేయాలనీ, వీటితో పాటు పెండింగ్లో ఉన్న జీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరారు.