- హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం
- ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
కొరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలు , గుంటూరు సరిహద్దు గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కొరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలు, సహాయక చర్యలపై బుధవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, రామకృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా మిగతా జ్లిలలో పరిస్థితి అదుపులోనే ఉందనీ, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలపై అధికారులు ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు.
ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలన్నారు. ఎవరు పాజిటివ్గా తేలినా అతను కలసిన వారిని సైతం క్వారంటైన్ చేయాలన్నారు. హైదరాబాద్ ప్రజలు బయటికి పోకుండా, బయటి నుంచి నగరంలోనికి ప్రవేశించకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్య,, ఆరోగ్య శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలనీ, మొత్తం హైదరాబాద్ను చుట్టుముట్టి వైరస్ను తుదముట్టించాలని చెప్పారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాలలో కొరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందనీ, వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయని తెలిపారు. ఈ రెండు సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వైరస్ మన దగ్గర పుట్టింది కాదనీ, ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందేననీ, కాబట్టి ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే అంత త్వరగా వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆధికారులకు సూచించారు