సుప్రీమ్కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
సుప్రీమ్కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వ్ల : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ టెండర్లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇటీవల వివాదం తలెత్తింది. కొద్ది రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 203 విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ‘ఇ-ఫైలింగ్’ విధానం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని పిటిషన్లో కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. దీనికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణాబోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. బుధవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదించింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి హాజరు కావడం సాధ్యం తెలిపారు. టెండర్ల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇటీవల నీటిపారుదలశాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న ఈనేపథ్యంలో నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో రెండ్రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగే అవకాశముందని సమాచారం.