మహేశ్వరం, ప్రజాతంత్ర,మే9: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు భూములు ఇస్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ మార్చ్ భట్టి విక్రమార్క పాదయాత్ర 54వ రోజు మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రి నగర్ నుంచి బడంగ్ పేట్ నాదర్ గుల్ వరకు కొన సాగింది. రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి అధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో జిల్లెల గూడలోని అంబేద్కర్ విగ్రహానికి భట్టి విక్రమార్క పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాదయాత్రలో భట్టి విక్రమార్క కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నీరాజనాలు పలికారు. అడుగుఅడుగున ప్రజలు జై కాంగ్రెస్, జై భట్టి విక్రమార్క, జై చల్లా నర్సింహ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటి స్థలాలు, భూములు ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం గుంజుకుంటుందని ఆరోపించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ముందు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి, ఇండ్లు, భూములు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి లాక్కుంటున్నాయని మండిపడ్డారు. రాజ్యహింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నమన్నారు.ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాటి చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ.. రాజధాని నడిబొడ్డున రాజ్య హింస భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటయో బిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందన్నారు.కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల హక్కులను పూర్తిగా అనగదొక్క బడుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దమనకాండ పై ప్రజా సంఘాలు, సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు పేదలకు అండగా నిలబడేవి, కానీ ఇప్పుడు పేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్న ఏ ఒక్కరు నోరు మెదపకపోవడం బాధాకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు హక్కుగా పేదలకు ఇచ్చిన భూమి లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. బలవంతంగా పేదల నుంచి భూములను లాక్కోవడం హేయమైన చర్యగా అయన అభివర్ణించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజ్య హింసపై మేధావులు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన పదివేల ఎకరాలను ఈ ప్రభుత్వం పేదలను భయపెట్టి బలవంతంగా ఈ ప్రభుత్వం గుంజుకున్నదన్నారు. హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం గుంజుకున్నదనటే, ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర అని అన్నారు. పేదల నుంచి గుంజుకున్నా భూములను సంపన్న వర్గాలకు కంపెనీలకు అప్పగించడమే కాకుండా హెచ్ఎండిఏ లే అవుట్లు చేసి విక్రయించడం పెద్ద దుర్మార్గమన్నారు.గత ప్రభుత్వాలు హక్కుగా ఇచ్చిన భూములు గుంజుకునే హక్కు ఎవరికీ లేదు. వచ్చే జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. మీ భూముల్లో మీరు అరక పట్టి దుక్కి దున్ని, పంట పండించుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అదే విధంగా మీకు ఇచ్చిన ఇంటి స్థలాలో ఇల్లు కట్టుకోవడానికి సమాయత్తం కావాలన్నారు. ఎవరు అడ్డు వస్తారో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, తిరిగి మీ భూములు మీకు ఇస్తామని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్, నాదర్ గుల్, ఆల్మాస్గూడ, మామిడిపల్లిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం 4 వేల మంది పేదలకు ఇచ్చినా ఇండ్ల స్థలాలను బలవంతంగా గుంజుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. జిల్లేలగూడ, మీర్ పేట్, కుర్మమల్ గూడలో గత ప్రభుత్వం కట్టిన నాలుగు వేల ఇండ్లను 9 సంవత్సరాలుగా పంపిణీ చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన హక్కులను కాలరాయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కుర్మల్ గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన 4వేల ఇండ్లను రెండు నెలల్లో పేదలకు పంపిణీ చేయకుంటే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలను ఇండ్ల వద్దకు తీసుకువెళ్లి గృహప్రవేశం చేయిస్తామన్నారు. మహేశ్వరం మండలంలో ఫార్మాసిటీ కంపెనీ కోసం 500 ఎకరాలను లాక్కోవడంతో పాటు మరో 400 ఎకరాలను బఫర్ జోన్లో ఈ ప్రభుత్వం పెట్టిందన్నారు. వెయ్యి ఎకరాలు భూములను తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నిచారు. 2023- 24లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చేంత వరకు మీ భూములను మీరే దోపిడీ కాకుండా కాపాడుకోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బిఅర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న భూములను తిరిగి పేదలకు ఇస్తామని అన్నారు. అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు, మీడియా, సామాజిక బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి వ్యక్తిరేకంగా ప్రజలకు అండగా నిలవాలన్నారు.
ప్రజాయుద్ధ నౌక గద్దర్ భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొని, తన మద్దతు ఇచ్చి మాట్లాడుతూ.. 200 ఏళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలు కాపాడుకుంటున్న భూములను వారికి లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ దగా చేయడానికే ధరణి తీసుకొచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన పత్రికలు, మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులకు వారికి హక్కుగా ఉన్న ఇంటి స్థలాలను వెంటనే కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వోట్ల విప్లవం రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి, ప్రజలను చైతన్య పరిచి కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా వోట్లు పోలరైజ్ చేసుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్లు లేకుండా పోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి యేలిమేటి అమరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.