కరోనాపై మీడియాకు వెల్లడించిన మంత్రి ఈటెల
: కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసు నమోదయినందున ప్రత్యేక శ్రద్ద తీసుకుని చికిత్స అందిస్తున్నామని అన్నారు. కేంద్రానికి సమాచారం ఇచ్చామని కూడా తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్ కలకలంపై డియాతో మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి..ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లాడని..హాంకాంగ్కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడన్నారు. తర్వాత బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్కు వచ్చాడన్నారు. జ్వరం వచ్చిందని ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చాడని, యువకుడి శాంపిల్స్ను పుణె పంపామన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని ఈటల స్పష్టం చేశారు. మన టెంపరేచర్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్లు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దేశంలో కరోనాతో ఎవరూ చనిపోయిన సంఘటనలు లేవన్నారు. యువకుడు ఎవరెవరిని కలిశాడో వాళ్లకు కూడా పరీక్షలు చేస్తామన్నారు. యువకుడి కుటుంబ సభ్యులు.. అతనితో బస్సులో ప్రయాణించిన వాళ్లకి పరీక్షలు చేస్తామన్నారు. 14 రోజుల పాటు వ్యక్తిని వైద్యులు పర్యవేక్షిస్తారని ఈటల రాజేందర్ చెప్పారు.