- మున్సిపల్ యంత్రాంగమంతా కొరోనా నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి
- 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజన
- ప్రతీ యూనిట్కు ప్రత్యేకంగా వైద్య, పోలీసు,, మున్సిపల్, రెవెన్యూ అధికారులు
- ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దు
- జీహెచ్ఎంసిలో కొరోనా నియంత్రణపై సిఎం కెసిఆర్ ప్రత్యేక సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి పాజిటివ్గా వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి అందువల్ల హైదరాబాద్లో కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక వ్యూహం అనుసరించాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలనీ, ప్రతీ యూనిట్కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్, రెవెన్యూ అధికారులను నియమించాలని పేర్కొన్నారు. మున్సిపల్ యంత్రాంగమంతా కొరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలనీ, ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికీ ఒకే డీఎంహెచ్వో ఉన్నందున అందువల్ల 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారులను నియమించాలని ఆదేశించారు. కొరోనా వ్యాప్తి నిరోదానికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం సోమవారం ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలలో కొరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను, లాక్డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్లు వ్యవహారాలను, సీఎం సమీక్షించారు.
సీఎం కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ముఖ్య కార్యదర్శి నర్సిం•గ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 32 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందనీ, ఒకరు మరణించారని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబోరేటరీలను, అసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్క రోజు 1000 నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. దీంతో పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 2426 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామనీ, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంట్లు ఉన్నట్లు తెలిపారు.
వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలనీ, ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు, బయటి వారిని లోపలికి రానివ్వవద్దని స్పష్టం చేశారు. ప్రతీ కంటైన్మెంటుకూ ప్రత్యేక పోలీసు అధికారిని నోడల్ అధికారిని నియమించాలనీ, వారి ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని స్పష్టం చేశారు. అత్యధిక జనసమ్మర్థం ఉండే జీహెచ్ఎంసి పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని సీఎం అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు ప్రతీరోజూ ఉదయం ప్రగతి భవన్లో జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలనీ, పరిస్థితికి తగిన విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనీ, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.