తెలంగాణతో నాబంధం ముడివడి ఉంది
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : ‘ఫామ్ హౌజ్లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు-రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.’ అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సిఎం కెసిఆర్పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లు కాదు..పుట్టుకతో ఉందన్నారు. రాజ్ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వం తరుపున సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్ పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై గవర్నర్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు-నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి అన్నారు. కొంతమందికి తాను నచ్చక పోవచ్చునని..కానీ తనకు తెలంగాణ ప్రజలంటే ఇష్టమని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గవర్నర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న, ఆస్కార్లకు నామినేట్ అయిన ’నాటు నాటు’ పాట స్వరకర్త/గీత రచయిత ఎంఎం కీరవాణి, చంద్రబోస్లను గవర్నర్ తమిళిసై సత్కరించారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్భవన్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ తర్వాత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై..తెలంగాణ రాష్ట్రం ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూనే పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కొంతమందికి తాను నచ్చకపోయి నప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్భవన్ సహకారం అందిస్తుందని ..రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం..ప్రజాస్వామ్యాన్ని కాపాడ దామంటూ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.
గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు
సెంట్రల్ విస్టాలాంటి నిర్మాణాలను వ్యతిరేకించామని వెల్లడి
హైదరాబాద్, జనవరి26 : తెలంగాణ ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టాద కంటే , దేశ మౌలిక సదుపాయాల ద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని కవిత గుర్తు చేశారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము అని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడారని తలసాని పేర్కొన్నారు. గవర్నర్ వైఖరిపై త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తామని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీ కి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రాజకీయాలకు ఉపయోగించడం తగదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.