– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై డాక్టర్ బి.ఆర్,అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి సమస్యలను జటిÄలం చేయవద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీ వేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.



