- కేంద్ర జలమంత్రిత్వం శాఖ ప్రశంస
- సమిష్టి కృషి ఫలితమే అన్న మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 14 : సిద్దిపేట జిల్లాకు కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంస లభించింది. ఈ మేరకు కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అభినందన లేఖను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపారు. భారత ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో మీ ప్రశంసనీయమైన పనిని, అలాగే జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీ ‘స్వచ్ఛ్ ఫిల్మ్ కా అమృత్ మహోత్సవ్-2021’లో పాల్గొనడాన్ని అభినందిస్తుందనీ లేఖలో పేర్కొన్నారు. భారతదేశం మిషన్ (గ్రామీణ) ఫేజ్-2లో భాగంగా దేశవ్యాప్తంగా ‘సంపూర్ణ స్వచ్ఛత‘ సాధించడానికి సిద్దిపేట జిల్లాలో మీ పనితీరు, లక్ష్యాల సాధన ప్రేరణ ఇస్తుందన్నారు. రానున్న రోజుల్లో సిద్దిపేట జిల్లా త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగాలలో మరింత మంచి పనితీరు కనబరుస్తూ దేశంలో నీ మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అభినందన లేఖలో ఆకాంక్షించారు.
స్వచ్ఛ భారత్ మిషన్ అధ్వర్యంలో లఘు చిత్రాల పోటి (స్వచ్ఛత ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ్) -2021 లో భాగంగా జిల్లాలో త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం లో సాధించిన ఫలితాలను తెలుపుతూ జిల్లాలోని గ్రామ పంచాయితీ కార్యదర్శులు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యవేక్షణలో 160కి పైగా లఘు చిత్రాలను రూపొందించి పంపడంతో జిల్లాలో అభివృద్ధిని వీక్షించి కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అధికారులను అభినందిస్తూ లేఖను పంపారు. స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అధికారుల, క్షేత్ర సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు, పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని మంత్రి హరిష్ రావు వెల్లడించారు.
ముఖ్యంగా త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామాలు మునుపెన్నడు లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించాయని, జిల్లాలో త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో సాధించిన ఫలితాలు, క్షేత్ర ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరు దేశంలోని మిగతా గ్రామాలకు, ప్రజలకు ప్రేరణ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం మనందరికీ గర్వకారణం అని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత ద్విగుణీకృతం ఉత్సాహంతో పని చేయాలని క్షేత్ర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయితి సెక్రటరీ లు, శానిటేషన్ సిబ్బంది నీ కోరుతున్నాను. జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు నా ప్రత్యేక అభినందనలు.