మునిసిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు
ప్రజా భాగస్వామ్యం, స్థానిక కౌన్సిలర్ల సహాకారంతో ఐదేండ్లలో సిద్దిపేట పురపాలక సంఘం అద్భుత పనితీరుతో దేశానికే రోల్ మోడల్గా నిలిచిందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అధ్యక్షతన సిద్దిపేట పురపాలక సంఘం 2021-22 అర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం జరిగింది. 2021-22 సంవత్సరానికి రూ.154 కోట్ల 43 లక్షల అంచనతో రుపొందించిన బడ్జెట్కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే విధంగా పారిశుద్ధ్య, ఇతర కార్మికుల వేతనం 30శాతం పెంచుతూ ప్రతిపాదించిన తీర్మానంకు, తడి, పొడి, హనీకరమైన చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చెత్త రహిత పట్టణంగా సిద్దిపేట పట్టణంను తీర్చిదిద్దిన డా.శాంతిని అభినందిస్తూ ప్రతిపాదించిన తీర్మానంకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ…ఐదెండ్లలో ప్రజా భాగస్వామ్యం, స్థానిక కౌన్సిలర్ల సహాకారంతో సిద్దిపేట పట్టణంను అద్భుతంగా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఐదేళ్లలోనే పురపాలక సంఘం ద్వారా 529 కోట్ల 35 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల నిధులు రూ.4620 కోట్ల రూపాయలతో సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఐదేళ్లలో మున్సిపల్ నిధులు, ఇతర ప్రభుత్వ శాఖల నిధులు మొత్తం రూ. 5149 కోట్ల రూపాయలతో సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఐదెండ్లలో అత్యద్భుతమైన పనితీరుతో కళ్ళముందే రూ.3690 కోట్లతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు, 163 కోట్లతో రెండు పడక గదుల గృహ సముదాయం, రూ.715 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల, రూ.3.5 కోట్లతో ఆధునాతన గ్రంథాలయం, రూ.40 కోట్లతో ఐటి పార్క్, పర్యటన హోటల్, ఫిస్కల్ స్లుడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డంప్ యార్డ్, ఆనందం, ఆహ్లాదం పంచుతూ రాష్ట్రానికి రోడ్ మోడల్ గా నిలుస్తున్న కోమటి చెరువు, ఫ్లడ్లైట్లతో కూడిన స్టేడియం స్విమ్మింగ్ పూల్, పురపాలక సంఘం కార్యాలయంలో ఎయిర్ కండిషన్డ్ సమావేశ మందిరం, ఇలా చెప్పుకుంటే పోతే అనేక అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ పాలకవర్గ హయంలోనే సిద్దిపేట జిల్లా అవతరించిందని, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు అయిందని, సుడా పురుడు పోసుకుందని మంత్రి తెలిపారు.
క్లీన్ గ్రీన్ అంశంలో దేశానికి ఆదర్శం
సిద్దిపేట పురపాలక సంఘాన్ని క్లీన్ గ్రీన్ అంశంలో దేశానికి ఆదర్శంగా నిలిపామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు వొస్తున్న ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం సిద్ధిపేట పట్టణం అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపిస్తున్నాన్నారు. తమ పట్టణాలలో వాటిని అమలు చేస్తున్నారన్నారు. సిద్దిపేట పురపాలక సంఘంలో ప్రణాళికాబద్ధ పచ్చదనం పెంపుదల కోసం గతంలో ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో రెండు నర్సరీలు, సుడా పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి సిద్దిపేట పట్టణంను హరిత పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
అభివృద్ధికి, అవార్డ్లకు చిరునామాగా..
గతంలో పందులకు ప్రసిద్ధి చెందిన సిద్దిపేట పట్టణం ఇప్పుడు అభివృద్ధికి, అవార్డులకు చిరునామాగా నిలిపామని అని మంత్రి హరీష్ రావు తెలిపారు. పందులతోపాటు కోతుల బెడద లేకుండా చేశామన్నారు. అలాగే కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమకు తెలియగానే కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు వీలుగా శనివారం సిద్దిపేట పట్టణంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు.
పెరిగిన అవసరాలకు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం
సిద్దిపేట పట్టణంలో 1976 సంవత్సరంలో అప్పటి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చొక్కారావు రవాణా శాఖ మంత్రి హోదాలో ప్రస్తుత పాత బస్టాండ్ను ప్రారంభించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. పాత బస్టాండ్ ప్రారంభించే సమయంలో 1500 నుంచి 2 వేల మంది వరకు మాత్రమే ప్రయాణికులు ఈ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగించే వారిని తెలిపారు. కాలక్రమంలో ఈ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 22 వేల వరకు పెరిగిందన్నారు. పీక్ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారని మంత్రి తెలిపారు. పెరిగిన ప్రయాణికుల అవసరాలకనుగుణంగా 6 కోట్లతో ప్రస్తుత పాత బస్టాండ్ స్థానంలో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఎక్కువ బడ్జెట్ సిద్దిపేటదే..
వొచ్చే ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన బడ్జెట్ పలు చిన్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే కూడా ఎక్కువ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంతో సమానంగా సిద్దిపేట పురపాలక సంఘం బడ్జెట్ ప్రవేశ పెట్టామని అని మంత్రి తెలిపారు. అనంతరం సిద్దిపేట పట్టణ ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు రూ. 26 లక్షల వ్యయంతో సిద్దిపేట పురపాలక సంఘం సమకూర్చుకున్న రెండు స్వీపింగ్ ట్రాక్టర్ మెషిన్లను మంత్రి హరీష్ రావు పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ కె రాజనర్సు మాట్లాడుతూ..మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్లీన్ అండ్ గ్రీన్ అంశంలో సిద్దిపేట పురపాలక సంఘం దేశంలోనే ఉత్తమ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. కోట్లాది రూపాయల వెచ్చించి సంపూర్ణ ప్రజా భాగస్వామ్యంతో సిద్దిపేట పట్టణంను మోడల్ పట్టణంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ అగ్రగామి మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని చైర్మన్ అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో సిద్దిపేట పురపాలక సంఘం పనితీరుకు అనేక అవార్డులు దక్కాయని ఆయన తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ మాట్లాడుతూ..హైదరాబాద్ దీటుగా అన్ని రంగాలలో సిద్ధిపేట పురపాలక సంఘం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.