ఉద్యమంతో షాహీన్ బాగ్ ప్రపంచ వార్తలోకెక్కినా.. ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో స్థానిక చిరు వ్యాపారులు
“షాహిన్ బాగ్ చిన్న వ్యాపారులు మాత్రం విజయవంతమైన ఈ నిరసన తమను ఆర్థికంగా కుదేలు చేసిందని చెప్పారు. సుమారు 200-దుకాణాలు ఉన్న మార్కెట్లో కనీసం 15 దుకాణాలు ఒక సంవత్సర కాలం శాశ్వతంగా మూసివేయబడ్డాయి. ముందు షాహిన్ బాగ్ నిరసన కోసం, అటుపై కోవిడ్ వలన దుకాణాలకు తాళాలు పడి స్థానిక చిన్న వ్యాపారాలు కుదేలయ్యారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరవాత కూడా వైరస్ భయంతో మరో 60 దుకాణాలు తిరిగి తెరవబడలేదు. ఇక్కడ వ్యాపారం ప్రారంభించడం ప్రమాదకరమని ప్రజలు భావిస్తున్నారు. పోలీసులు నిరంతరం కాపలాగా ఉంటుండగా, గత సంవత్సరం నిరసన తరవాత ఈ స్థలం ప్రభుత్వ సంస్థల రాడార్ కిందకు చేరిపోయింది. మాములు శాంతిభద్రతల సమస్య వొచ్చినా కూడా మొత్తం మార్కెట్ మూసివేయవొచ్చని ప్రజలు భావిస్తున్నారు.”

ఏడాది క్రితం, ఢిల్లీ నుంచి నోయిడాను అనుసంధానించే రోడ్డులో సాధారణ ప్రజానీకం..ముఖ్యంగా స్థానిక మహిళా పౌరులు పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తలపెడితే.. షాహీన్ బాగ్ రోడ్ నంబర్ 13ఎ, ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. 100 మంది స్థానిక నివాసిత బృందం సిట్-ఇన్ నిరసనగా ప్రారంభమై 101 రోజుల పాటు కొనసాగింది. దీనిని స్వతంత్ర భారత దేశంలో ఓ చట్టానికి(పౌరసత్వం సవరణ) వ్యతిరేకంగా మహిళలను ప్రథమ స్థానంలో ఉంచి జరిపిన అతిపెద్ద మరియు ప్రముఖ నిరసనలలో ఒకటి అని చెప్పక తప్పదు. వంద మంది స్థానిక మహిళలతో మొదలయిన నిరసన దేశంలోని ఇతర ప్రాంతాల వందలాది సిఏఏ వ్యతిరేకులు తమ తమ ప్రాంతాలలో షహీన్ బాగ్ తరహా నిరసనలు ఏర్పాటు చేసేలాగా చేసింది. లక్నౌలో లాల్ చౌక్, బీహార్ షహీన్ బాగ్..ఇలా ఇతర ప్రాంతాలలో కూడా షాహిన్ బాగ్ జననం జరిగింది. ఓ రహదారి ధర్నా ప్రభుత్వ కొత్త చట్టానికి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కి ఓ రోజు ముందు, మార్చి 24, 2020 ఉదయం షాహిన్ బాగ్ ధర్నాని రాజ్యం క్షణాల వ్యవధిలో ఎత్తి వేసి స్థానిక మహిళలను ఇళ్లకు పంపించింది. ఆ రోజు షాహిన్ బాగ్ రోడ్ నెంబర్ 13ఏ..షహీన్ బాగ్ మార్కెట్..స్థానిక ప్రజల దైనందిన జీవితం ఎలా వుంది..? షాహిన్ బాగ్ మన మనసులో ఉంటే ఈ ప్రశ్న తప్పక పుడుతుంది.
షాహీన్ బాగ్ రోడ్ 13ఎ.. షాహిన్ బాగ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్ల హౌస్ సమీపంలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం హింస యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా 15 డిసెంబర్ 2020 నాడు నిరసనకారుల బృందం సమావేశం అయింది. వెంటనే ఢిల్లీ పోలీసులు నిర్ధాక్షిణ్యంగా నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకు వొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో అనేక ఎంట్రీ పాయింట్ల వద్ద ఇదే విధమైన ధర్నా జరుగుతున్నది. నిరసనలో వేలాది మంది రైతులు కూర్చుని వున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నడిబొడ్డులో ఆగ్రహ జ్వాల రగలకుండ తగినంత జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే షాహిన్ బాగ్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను దింపింది. షాహిన్ బాగ్ సిఏఏ, ఎన్ఆర్సి నిరసనలు నిర్వహించిన వారిని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఎలాంటి చిత్ర హింసాలు పెడుతున్నది..సాఫురా జర్గర్.. ఉమర్ ఖాలిద్ వంటి వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి అర్ధం చేసుకోవచ్చు. నిత్యం సోషల్ మీడియా ప్లాట్ఫార్మస్ మీద కనిపించే వారి పరిస్థితి ఇలా ఉంటే..షాహిన్ బాగ్ సామాన్య ప్రజల పరిస్థితి ఇంకేలా ఉంటుందో మీరు ఊహించ గలరు.
అయినా మచ్చుకు కొన్ని అంశాలు..
గత వారం, షాహీన్ బాగ్ వీధుల్లో కాపలాగా ఉండటానికి ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని షాహిన్ బాగ్లో నిలిపింది. గత సంవత్సరం ఏమి జరిగిందో..అది మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గత వారం క్రితం వరకు, 5 నుంచి 6 మంది స్థానిక పోలీసు సిబ్బంది పగటిపూట మార్కెట్లో పెట్రోలింగ్ చేసేవారు. రాత్రి వేళ పెట్రోలింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సాయుధ కమాండోలు షాహిన్ బాగ్ మొత్తాన్ని కాపలా కాస్తున్నారు. రైతుల నిరసనకు అనుకూలంగా షాహిన్ బాగ్ రహదారి కనుక నిలబడితే మతం కోణం పక్కకి పోయి పోరాట ఐక్యత బయట పడుతుంది. ఇది ప్రస్తుత ప్రభుత్వం యెంత మాత్రం కోరుకోదు. అందుకే షాహిన్ బాగ్లో కాశ్మీర్ తరహా బోర్డర్ సెక్క్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసిందని షాహీన్ బాగ్ వద్ద స్థానిక మార్కెట్లో వస్త్ర దుకాణం నడుపుతున్న నలభై ఏళ్ళ సోలంకి అన్నారు. షాహిన్ బాగ్ మార్కెట్లో నాలుగు రోజుల క్రితం ఓ బస్సు నిండే అంత మంది సాయుధ బిఎస్ఎఫ్ సిబ్బంది, మార్కెట్ అంతటా కవాతు చేసారు. వారిని కదిలిస్తే మాట్లాడటానికి నిరాకరిస్తారు. తాము ఎందుకు ఉన్నామో అక్కడ అందరికి తెలుసు.. ప్రతేకంగా చెప్పేది ఏం లేదనే విదిలించుకుపోయే సమాధానం మాత్రమే వారి నుంచి వినిపిస్తుంది.
ఎకె -47 రైఫిల్స్ను పట్టుకుని, బిఎస్ఎఫ్ సిబ్బంది మార్కెట్ వెంట సందులలో గస్తీ తిరుగుతున్నారు. షాహీన్ బాగ్ నివాస ప్రాంతాల గల్లీలలో వీరు తిరుగుతున్నారు. సాయుధ కమాండోలు, స్థానిక పోలీసు అధికారులతో పాటు పోలీసు క్విక్ రియాక్షన్ టీం(క్యూఆర్టి) వాహనం రోడ్లపై నిలిపి గస్తీ కాస్తున్నారు. సిఏఏ, ఎన్ఆర్సి మాత్రమే కాదు..వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి అనుకూలంగా ఎవరైనా బ్యానర్లు పట్టుకున్నా..అసలు ఆ అవకాశం కూడా లేకుండా చేయటానికి బోర్డర్ సెక్యూర్టీ సిబ్బంది, వీరితో పాటుగా ఢిల్లీ పోలీసులు షాహిన్ బాగ్ వీధుల్లో కవాతు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు.
ప్రభుత్వ పెద్దల భయాన్ని అర్థం చేసుకోవచ్చు. షాహిన్ బాగ్ నిరసన మొదట ప్రారంభమైనప్పుడు, ఒక చిన్న కాలనీ అయిన షాహీన్ బాగ్ నిరసనగా నిలిచింది. రాజధాని వెలుపల ఎవరికీ షాహిన్ బాగ్ తెలియదు. అసలు రాజధాని నివాసితులు చాలా మందికి షాహిన్ బాగ్ తెలియదు. నిరసన పెరిగేకొద్దీ, ఢిల్లీ నలుమూలల నుండి ప్రజలు షాహీన్ బాగ్ వైపు వెళ్ళారు. ఇక్కడి ఇండియా గేట్ ప్రతిరూపాలను చూడటానికి ప్రజలు తరలివొచ్చారు. ధర్నా స్థలంలో దేశవ్యాప్తంగా సిఏఏ వ్యతిరేక నిరసనలలో మరణించిన వారి పేర్లు చెప్పేవారు. యువతీ యువకులు ఉద్వేగభరితమైన విప్లవాత్మక కవితలు చదవడం ఇక్కడ జరిగింది. షాహీన్ బాగ్ వృద్ధ మహిళలు దేశానికి నానమ్మలు, అమ్మమ్మలు అయ్యారు. సెప్టెంబరులో, టైమ్ మ్యాగజైన్ 2020లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరుగా దేశ ప్రధాని మోడీతో పాటు షాహిన్ బాగ్ నానమ్మ 82 ఏళ్ళ బిల్కిస్ బాను కూడా ఎంపిక అయ్యారు. ఈ ప్రాంతంలోని అనేక మంది నివాసితులు చెప్పే మాట ‘‘షాహీన్ బాగ్ అత్యంత విజయవంతమైన సిట్-ఇన్ నిరసన.’’ ప్రత్యేకించి ఆది నుంచి అంతం వరకు హింస జరగలేదు అంటారు.
అయితే షాహిన్ బాగ్ చిన్న వ్యాపారులు మాత్రం విజయవంతమైన ఈ నిరసన తమను ఆర్థికంగా కుదేలు చేసిందని చెప్పారు. సుమారు 200-దుకాణాలు ఉన్న మార్కెట్లో కనీసం 15 దుకాణాలు ఒక సంవత్సర కాలం శాశ్వతంగా మూసివేయబడ్డాయి. ముందు షాహిన్ బాగ్ నిరసన కోసం, అటుపై కోవిడ్ వలన దుకాణాలకు తాళాలు పడి స్థానిక చిన్న వ్యాపారాలు కుదేలయ్యారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరవాత కూడా వైరస్ భయంతో మరో 60 దుకాణాలు తిరిగి తెరవబడలేదు. ఇక్కడ వ్యాపారం ప్రారంభించడం ప్రమాదకరమని ప్రజలు భావిస్తున్నారు. పోలీసులు నిరంతరం కాపలాగా ఉంటుండగా, గత సంవత్సరం నిరసన తరవాత ఈ స్థలం ప్రభుత్వ సంస్థల రాడార్ కిందకు చేరిపోయింది. మాములు శాంతిభద్రతల సమస్య వొచ్చినా కూడా మొత్తం మార్కెట్ మూసివేయవొచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరో చోట బట్ల హౌస్ లేదా సరితా విహార్లో దుకాణాన్ని పెట్టి వ్యాపారం చేయవొచ్చు కానీ షాహిన్ బాగ్లో కుదరదని ప్రజలు భావిస్తున్నారని ఇక్కడి షాపుల్లో పనిచేసే కార్మికులు చెబుతున్నారు. షాహీన్ బాగ్ మార్కెట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాసిర్ హుస్సేన్ ఇలా అన్నారు ‘‘చాలా మంది దుకాణదారులు మళ్ళీ తిరిగి రాలేదు. నిరసన సమయంలో రోడ్డు దిగ్బంధనం..ఆ తరువాత లాక్డౌన్ కారణంగా ఇక్కడి చిన్న వ్యాపారస్తులు భారీ నష్టాలను చవిచూశారు.’’
షాహిన్ బాగ్లోని ఓ నివాసి మాట్లాడుతూ..
‘చాలా మంది స్థానిక వ్యాపారులు మళ్ళీ షాహిన్ బాగ్ తరహా నిరసన ప్రదర్శనను ఇక్కడ జరగాలని కోరుకోరు. షాహీన్ బాగ్లో ఖచ్చితంగా మళ్ళీ ఆ తహ నిరసన నిలబడటం అసాధ్యం. ఢిల్లీ నిరసనలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈసారి షాహిన్ బాగ్ తరహా నిరసన ఇక్కడ జరగదు. మహిళలు, పిల్లలు అధికారంతో నిజం మాట్లాడటానికి ధైర్యం చేసిన ఓ ఆకస్మిక పోరాటం ఢిల్లీలోని ఇతర ప్రాంతాలలో జరిగే అవకాశం వుంది. ఇక్కడ షాహీ బాగ్లో జరిగే అవకాశం తక్కువ. కారణం షాహిన్ బాగ్ నిరంతరం నిఘాలో ఉంది’ అని చెప్పారు. షాహిన్ బాగ్ పోరాటం సిట్ నిరసనకు చుక్కానిగా నిలిచినందుకు ప్రభుత్వ దమనాన్ని చవిచూస్తున్నది. కాశ్మీర్ తరహా భద్రతా ఏర్పాట్లు గతవారం రోజులు షాహిన్ బాగ్లో నెలకొని వున్నాయి.