భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాము(కమ)లమ్మపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తనదైనశైలిలో మండిపడ్డారు. బిజెపిలో చేరిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారనీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై విహెచ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారనీ విజయశాంతికి కాంగ్రెస్ పార్టీని వదిలి బిజెపిలోకి వెళ్లేటప్పుడు తెలిసిందా? అని ప్రశ్నించారు.
భారత్ బంద్లో భాగంగా విహెచ్ మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి పార్టీకి సేవ చేసిన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వొచ్చిన రాములమ్మకు స్టార్ క్యాంపెనర్గా బాధ్యతలు ఇచ్చిందని..ఆ అదృష్టం ఎవరికీ రాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్టేనని వీహెచ్ పేర్కొన్నారు.