109 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు అనుమతులు – స్టేట్ బ్రాడ్బ్యాండ్ కమిటీ సమావేశంలో సిఎస్
స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన బుధవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 0.71 శాతం టవర్ డెన్సిటి ఉండగా దేశంలో 0.42 శాతం మాత్రమే ఉందన్నారు. నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ 2024 సంవత్సరం నాటికి 1.7 శాతానికి లక్ష్యంగా విధించిందని తెలిపారు. రాష్ట్రంలో బేస్ స్టేషన్ టవర్స్ ఫైబరేజేషన్కు, మంచి సమాచార కవరేజీ విస్తరణకు అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో టవర్స్ ఫైబరేజేషన్ 35 శాతం ఉందని, నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ 70 శాతంగా విధించిన లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు.
ఈ కమిటీలో పంచాయతీరాజ్, విద్యుత్శాఖల నుండి ప్రతినిధులను సభ్యులుగా చేర్చటానికి సీఎస్ హామి ఇచ్చారు. 109 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు జారీ చేస్తామని సీఎస్ ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికీ కవర్ కానీ 140 గ్రామపంచాయతీలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,961 టవర్లు ఉన్నాయని, ఇంకా 34,902 టవర్లు నిర్మించవలసి ఉందన్నారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అడ్వైజర్, డీవోటీ-ఎల్ఎస్ఏ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ జె.వి. రాజా రెడ్డి, డైరెక్టర్(రూరల్), డీవోటీ-ఎల్ఎస్ఏ యూనిట్ జి.సురేష్ రెడ్డి, డైరెక్టర్(ఎలక్టాన్రిక్స్) ఐటీఅండ్సీ డిపార్ట్మెంట్ సుజయ్ కారంపూరి, సీఎండీఆర్ డా. జెనా (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), టీఆర్ దువా (టవర్ అండ్ ఇన్ఫ్రాస్టక్చ్ర ప్రొవైడర్ అసోసియేషన్) తదితరులు పాల్గొన్నారు.