Take a fresh look at your lifestyle.

సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ 284 ‌వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారా హిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు శతాబ్ధాల క్రితమే సేవాలాల్‌ ‌మహారాజ్‌ ‌నడయాడారని, అదే బంజారాహిల్స్ ‌నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా వున్నదని సిఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వొస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని సిఎం కేసీఆర్‌ అన్నారు.

అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ ‌జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా వున్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. బంజారాలకు స్పూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా వున్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని, సిఎం కేసీఆర్‌ అన్నారు. బంజారా/లంబాడా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి..‘మా తాండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చి, గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేశామన్నారు. అంతేకాకుండా..

ప్రతి తాండా గ్రామ పంచాయితీలో వొక గ్రామ పరిపాలన భవన్‌ ‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ దిశగా  గిరిజన సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సిఎం కేసీఆర్‌ అన్నారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం ఫరిడవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతుండడం తనకెంతో సంతోషంగా వుందని సిఎం అన్నారు. హైద్రాబాద్‌ ‌నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ ‌పేరుతోనే బంజారా భవన్‌ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామన్నారు. అందులో సంత్‌ ‌సేవాలాల్‌ ‌విగ్రహ ప్రతిష్టాపన చేసామని సిఎం అన్నారు. వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందని సిఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply