తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భావం మొదలు ఏ ఎన్నికల్లొనైనా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుంది. ఒకటి,రెండు సందర్భాల్లో మినహా తెరాసా ఎన్నికల్లో ఎన్నడూ ఓటమి ఎరుగదు. పార్టీ శ్రేణులను, కార్యకర్తలను సమాయత్తం చేయడంలో ఆ పార్టీ కి ఎవరు పోటీ రారు . ఈ సంవత్సరం ఆఖరి నాటికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఒక లోక్ సభ స్థానానికీ, 56 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి. అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం కూడా ఉంది. తెరాస సభ్యుడు రామలింగారెడ్డి మృతి కారణంగా దుబ్బాక నియోజకవ ర్గానికి ఉప ఎన్నిక నిర్వహించవల్సి వస్తోంది. ఈ నియోజకవర్గం మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఉంది.అదే నియోజకవర్గంలోని సిద్ధిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావుకు ఈ నియోజకర్గంలో తెరాస అభ్యర్ధిని గెలిపించే బాధ్యతను పార్టీ అధిష్టానం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.
అలాగే, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తిరిగి తెరాసను గెలిపించే బాధ్యతను మంత్రి కెటి రామారావు స్వీకరించారు. హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలను కిందటి సారి కూడా కెటి రామారావు స్వయంగా బాధ్యత తీసుకుని తెరాసకు విజయం సాధించి పెట్టారు . ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలను సాధించేందుకు ఇప్పటికే ఆయన పార్టీ నాయకులు, ప్రస్తుత కార్పొరేటర్లతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కార్పొరేటర్లలో కొంత మంది పని తీరుపై అసంతృప్తి ఉందన్న సమాచారం అందినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను ఎన్నికలతో నిమిత్తం లేకుండా విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కేటి రామారావు కృషి చేస్తున్నారు. ఇటీవల దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉంది. అలాగే, జంటనగరాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్ పై మూతలు తొలగి పొంగి పోయిన ఘటనల్లో పలువురు మృత్యువాత పడిన సంఘటనల పై కేటీ రామారావు సీరియస్ కావడమే కాకుండా, నగర పాలక సంస్థలో ఇందుకు సంబంధించిన విభాగాలను హెచ్చరించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ కు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశంలోని ఇతర నగరాల నుంచి ఉపాధి కోసం తరలి వచ్చేవారి సంఖ్య అత్యధికం.ఈ విషయం ఇటీవల కొరోనా వైరస్ వ్యాప్తి పై జరిగిన గణాంకాల్లో మరింత స్పష్టంగా తెలిసింది.
ఉపాధి అవకాశాలు బాగా పెరగడంతో హైదరాబాద్కుఇతర ప్రాంతాల నుంచి వలసలు బాగా పెరిగాయి.ఈ నేపధ్యంలో జంటనగరాల్లో పౌర సౌకర్యాలను మెరుగు పర్చడం కార్పొరేషన్ కు పెద్ద సవాల్, తెరాస అధీనంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ గడిచిన ఐదేళ్ళలో వేల కోట్ల రూపాయిలను ఖర్చు చేసింది.తాము చేసిన అభివృద్దే తమకు సీట్లు తెస్తుందని కెటి రామారావు ధీమాగా ప్రకటించారు. ఎన్నో పార్కులు, అండర్ బ్రిడ్జిలు, ప్లయిఓవర్లు, నిర్మించడం జరిగిందనీ, కార్పొరేషన్ స్వయంగా నిరుపేదలకు ఐదు రూపాయిలకు భోజనం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని వల్ల కూడా పేద వర్గాల ఆదరాభిమానాలను తెరాస చూరగొందన్న విశ్వాసం ఆ పార్టీ నాయకులలో ఉంది. కొరోనా వైరస్ విధించిన సవాల్ ను జంటనగరాలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయనీ, దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే ఇక్కడ మరణాలు తక్కువనేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాక, నగరంలో రోడ్ల నిర్మాణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడుతూ పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించలేదు. ఇటీవల ఒక సమావేశంలో కెటి రామారావు ప్రసంగిస్తూ బహుశా నవంబర్ లో ఉండవచ్చన్నారు. అయితే, నవంబర్ లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరగడం ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఏమైనా కొత్త సంవత్సరం వొచ్చే లోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకు తెరాస ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీష్ రావు కు అప్పగించినందున అక్కడ తెరాస సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. రామలింగా రెడ్డి భార్యకే తెరాస టికెట్ ఇస్తారన్న సమాచారం ప్రచారంలో ఉంది.కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్ది ఎంపికపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి ఎంపిక రెండు రోజుల్లో జరుగుతుందని అన్నారు. రామలింగారెడ్డి భార్యకు సీటు ఇస్తే తెరాస సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత లేదు.జగ్గారెడ్డిపై ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం టాగూర్ కు పలువురు ఫిర్యాదు చేయగా,ఆయన మందలించినట్టు వార్తలొచ్చాయి. అయితే, అవన్నీ పుకార్లని ఆయన ఖండించారు. ఏమైనా కాంగ్రెస్ నాయకులు తలోదారిలో వ్యవహరించడం వల్ల తెరాసకు ఈ ఉప ఎన్నిక లోనూ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సులభతరం అవుతుందని అనుకుంటున్నారు. అయితే, హైదరాబాద్, సికిందరాబాద్ లలో కార్పొరేషన్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి ఎనభై దగ్గరగా కార్పొరేటర్ స్థానాలను పార్టీ గెల్చుకోవల్సి ఉంటుంది.ఈ లక్ష్యంతో తెరాస ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య వైరం తెరాసకు కలిసొచ్చే అంశంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. వీటికి తోడు నిజామాబాద్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత శాసనమండలికి ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుగా ఉన్నాయని అంటున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలకు వోటర్ల నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో గెలుపును బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంఎల్ సి ప్రొఫెసర్ నాగేశ్వర్ లు పోటీ చేస్తారన్న వార్తలు వోచ్చాయి. మొత్తం మీద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా పరిణమించనున్నాయి.