ఖమ్మం నగర పాలక సంస్తలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన ఒప్పంద కార్మికులకు డిసెంబర్ నెల వేతనాలు అందక అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి కార్మికులు పస్తులతో ఎలా పనిచేస్తారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శించారు. సోమ వారం నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్జయంత్కు కార్మిక సంఘ ప్రతినిధిబృందం ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేషన్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు ఏ నెలా సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదన్నారు. ప్రతి నెలా కార్మికులు కార్మిక సంఘాలు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి పండుగ పూట కార్మికులు వేతనాలు లేక అప్పులు చేసుకుని కాలం గడపాల్సివస్తుందన్నారు. అసలే చాలీచాలని వేతనాలు, అవి కూడా సక్రమంగా చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్మికులకు సక్రమంగా వేతనాలు ప్రతి నెలా 5వ తేదీలోపు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘ నగర కార్యదర్శి నకిరికంటి కృష్ణ, నాయకులు కందుల మహేష్, కుక్కల హన్మంతు, జి నాగేశ్వరరావు, హుస్సేన్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.