స్వరూపానందేంద్ర స్వామిజీపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు భాష దారుణంగా ఉందని మండిపడ్డారు. గతంలో స్వరూపానందేంద్ర స్వామిజీని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కలిశారని.. ఇప్పుడు కుప్పంలో ఓటమితో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సజ్జల వి•డియాతో గురువారం మాట్లాడారు.
చంద్రబాబు హావభావాలు విచిత్రంగా ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. బాబు మాటలు హుందాగా, సంస్కారవంతంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన చంద్రబాబు ఇప్పుడు ముసుగు తొలగి బయటకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు చంద్రబాబు నిజంగా సేవ చేసి ఉంటే ఎందుకు ఎన్నుకోరు? అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఇలానే మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట రియాక్షన్ వస్తుందని హెచ్చరించారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్ది సీఎం జగన్ ముందుకెళ్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.