హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలోని రైతులకు మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. 2023-34 బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. రూ. 90 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సోషియో ఎకానమిక్ సర్వే విడుదల సందర్భంగా హరీష్ రావు వి•డియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు బంధు పథకానికి కూడా రూ. 275 కోట్లు పెరిగాయన్నారు. రైతు బీమా పథకానికి రూ. 123 కోట్లు పెంచామన్నారు. ఫీజు రియింబర్స్మెంట్, మెస్ నిధులను రూ. 4,690 కోట్ల నుంచి రూ. 5,609 కోట్లకు పెంచామని తెలిపారు. మొత్తంగా రూ. 919 కోట్లు పెరిగిందన్నారు. 33 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నాం.. ఇందు కోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఈ బడ్జెట్లో రూ. 460 కోట్లు అధికంగా కేటాయించామన్నారు. గతంలో రూ. 2,750 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో రూ. 3,210 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణ కోసం బ్జడెట్లో అతి ఎక్కువగా నిధులు కేటాయించుకున్నాం.
ఇందుకు రూ. 2500 కోట్లు కేటాయించాం. పంచాయతీరాజ్ శాఖలో కూడా రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించాం. మెరుగైన రోడ్లను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్లలె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పలు యూనివర్సిటీలలో హాస్టల్స్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వొచ్చింది. నూతన హాస్టళ్ల నిర్మాణానికి, ఆధునీకరణకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 80 వేల ఉద్యోగాల పక్రియ వేగంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 950 మందిని రిక్రూట్ చేశాం. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో రూ. 1000 కోట్లు కొత్త ఉద్యోగుల కోసం బడ్జెట్లో కేటాయించాం. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ 1 నుంచి క్రమబద్దీకరిస్తాం. సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ను ఏప్రిల్ 1 నుంచి సవరిస్తాం అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖ ఆర్ అండ్ బీలో విలీనమైందని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ బీలో హౌసింగ్ కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించాం. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించాలనుకునే వారికి ఈ నిధులు కేటాయిస్తాం. రూ. 12 వేల కోట్లకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించిన నిధులతో ఎలాంటి సంబంధం లేదు. సొంత జాగలో ఇండ్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.