- జీహెచ్ఎంసి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యం
- హరేకృష్ణ మూమెంట్ సంస్థతో టిఎస్ఎంఐడీసి ఎంవోయూ
- సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర , హైదరాబాద్ : హైదరాబాద్లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5కే మూడు పూటలా భోజనం అందనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం టీఎస్ఎంఎస్ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, హరే కృష్ణ మూమెంట్ ఎంవోయూపై సంతకాలు చేశారు. రూ.5కే భోజనం కోసం ప్రభుత్వం ఏటా రూ.38.66 కోట్లు ఖర్చు చేయనుంది. జీహెచ్ఎంసిలో రూ.5 కే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటికే పేదలకు భోజన సౌకర్యం అందిస్తున్న విధంగానే ప్రభుత్వ హాస్పిటళ్ల వద్ద రోగుల సహాయకులకు ఈ సౌకర్యం అందనుంది. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబార్రైస్తో పాటు పచ్చడి బ్రేక్ ఫాస్ట్గా అందించనున్నారు.
దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు రోజుల తరబడి వైద్య చికిత్సల కోసం దవాఖానాలలోనే ఉండాల్సి వొస్తుంది. వారి కోసం వొచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించి ప్రభుత్వం రోగుల సహాయకులకు కూడా భోజన సౌకర్యం అందించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసి పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, సరోజినీదేవి, ఈఎన్టి, పేట్లబుర్జు, ఎంఎన్జే, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, కోఠి మెటర్నిటీ, కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్ తదితర 18 దవాఖానాలలో రోగుల సహాయకులకు ఈ భోజన సౌకర్యం అందుతుంది. ఈ రాయితీ భోజనం కోసం ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.38.66 కోట్లు కేటాయించనుంది.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్ రావు
ప్రభుత్వ దవాఖానాలలో రోగుల కోసం వచ్చే సహాయకులకు రూ.5కే భోజనం సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపమని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో గతంలో దీనిపై హామీ ఇచ్చారనీ, ఆయన ఆలోచన మేరకే జంట నగరాల్లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
హరే కృష్ణ మూమెంట్ స్వచ్చంద సంస్థతో పదేళ్ల అనుబంధం ఉందనీ, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ట్రస్ట్ తరఫున మధ్యాహ్న భోజనం పాఠశాల విద్యార్థులకు భోజనం ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలు ప్రభుత్వ దవాఖానాలకు వస్తారనీ, రూ.5 కే భోజనం వారి కోసం వచ్చే భోజన అవసరాలను తీరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.