‘ఆంధ్రప్రదేశ్ లో బలాన్ని పెంచుకోవడానికి ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీ ప్రయత్నిస్తోంది. అది తెలుగుదేశం నాయకులకు వణుకు పుట్టిస్తోంది.అంతేకాక, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని రామ్ మాథవ్ వంటి కేంద్ర నాయకుడే స్పష్టం చేసినప్పుడు , బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నాలు సాగిస్తోందన్నదానిలో ఎంతవరకూ నిజం ఉంది. బహుశా ఆర్ కె తన రాజకీయ బాస్ లను సంతృప్తి పర్చడం కోసం బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం జగన్ ను సిబిఐ కేసులు చూపి ఒత్తిడి తెస్తోందని ఆర్ కె భావించి ఉండవచ్చు..’
మనిషి బతకడానికి ఒక్కొక్కసారి తిండి, నీరు అవసరం లేదు . పుకార్లు ఉంటే చాలు..! సినీ దర్శకుడు రామగోపాల్ వర్మ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో రాథాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ వ్యాసాలను రెగ్యులర్ గా చదువుతుంటే, తన పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తున్నాడని తప్పకుండా కృతజ్ఞత చెబుతాడు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు యావత్ రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర రాజధానిగా అమరావతి భవితవ్యంపై సిగపట్లకు దిగుతున్నాయి. ఆర్ కె గా పిలవబడే రాథాకృష్ణ ఇప్పుడు కొత్తగా ఒక కథనాన్ని వండివార్చి జనం మీదికి వదిలారు. వారంవారం ఆయన ‘కొత్త పలుకు’ శీర్షిక పేరిట రాసేవన్నీ తలా తోకా లేని ఊహాగానాలే. ఇలాంటివి వదిలి జనం బుర్రలు ఖరాబు చేయడం ఆయనకు అలవాటు. ఇందుకు ఆయన ఒక జర్నలిస్టుగా తనకు ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్చను పూర్తిగా వినియోగించుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జర్నలిజం ప్రమాణాలకు మచ్చ తెచ్చే మూడు కూతలను (రాతలను ) చేర్చారు.తన వ్యాసం ద్వారా ఏదో సంచలనం సృష్టించాలని ఆయన అనుకుని ఉండవచ్చు. ఇలాంటి ఊహాగానాలను ప్రచురించడంలో ఆయన గుత్తాధిపత్యం వహిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆయన తాను టార్గెట్ చేసిన రాజకీయ పార్టీ మూలాలను దెబ్బతీయవచ్చని అనుకుని ఉండవచ్చు. కానీ, జర్నలిజం ప్రమాణాలను ఆయన విచ్చిన్నం చేస్తున్నానని భావించినట్టు లేదు. వార్తా సేకరణలో రాజకీయ పార్టీల జోక్యం ఎంతగా పెరిగి పోయిందో చూస్తున్నాం. చాలా పత్రికలు రాజకీయ పార్టీలకు కరపత్రాలుగా తయారయ్యాయి. వాటి రాజకీయ అజెండా కోసమే అవి పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆర్ కె గారి పత్రికది ఇలాంటి కల్పితగాథలను ప్రచురించడంలో ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉంటుంది. అయితే, ఇవన్నీ ఏకరవు పెట్టి కాలాన్ని వృధా చేయదల్చుకోలేదు.ఈ వారం తొలిపలుకులు శీర్షికలో ఆర్ కె నిర్హేతుకమైన కట్టుకథలను వండి వార్చారు. అయితే, గాసిప్స్ అంటేనే నిర్హేతుకమైనవి అదే వేరే విషయం.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడాన కి బీజేపీ అనేక మార్గాలను అన్వేషిస్తోందనీ, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోందని కథనం ప్రచురించారు. జగన్ రాజకీయ భవితవ్యం పూర్తిగా తమ చేతిలో ఉందని, ఆయనను తాము అదుపు చేయవచ్చని కేంద్రంలోని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు రాసుకొచ్చారు. వైసీపీని బీజేపీలో విలీనం చేయమని బీజేపీ కేంద్ర నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా కథనం అల్లారు. జగన్ ని లొంగదీయడానికి తమిళనాడులో అన్నా డిఎంకె అధినేత్రి జయలలితపై ప్రయోగించిన అస్త్రాన్నే ప్రయోగించాలని బీజేపీలో శక్తివంతమైన నాయకులు భావిస్తున్నట్టు కూడా ఆర్ కె గారు రాసుకొచ్చారు. ఒకవేళ జగన్ ఒప్పుకోకపోతే తమిళనాడు మాదిరి డ్రామా నడిపేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కూడా రాసుకొచ్చారు . కేంద్ర బీజేపీ నాయకుల ప్రతిపాదనను జగన్ ఎప్పటికీ అంగీకరించరనీ, ఎటువంటి పరిస్థినైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నామని తన పార్టీ నాయకులు, శ్రేణులకు ముందే ఉప్పు అందించారనీ, తన వారసురాలిగా తన భార్య వైఎస్ భారతిని చేయాలని సూత్రప్రాయంగా సూచన చేశారని కూడా ఆర్ కె తన ఊహాగాన కథనంలో ఎంతో ముందుకు వెళ్లిపోయారు. ఆయన తన రాజకీయ బాస్ లకు ఆనందాన్ని కలిగించేందుకే ఇలా రాసి ఉంటారు.ఎందుకంటే వారు వైసీపీకీ, బీజేపీకీ మధ్య అగాధం సృష్టించడానికి ఎంతో కష్టపడుతున్నారు మరి.
అమరావతి రాజధాని అంశం గురించి తాము జోక్యం చేసుకోమని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పిన దగ్గర నుంచి ఈ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్రానిదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాథవ్ స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ కూడా స్పష్టం చేసింది. జగన్ పై కేసులన్నీ కోర్టులలో ఉన్నాయి. కోర్టులు తుది తీర్పులు ఇచ్చేవరకూ వాటి గురించి మాట్లాడటం భావ్యం కాదు. ఈ విషయం టిడిపి నాయకులకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో బలాన్ని పెంచుకోవడానికి ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీ ప్రయత్నిస్తోంది. అది తెలుగుదేశం నాయకులకు వణుకు పుట్టిస్తోంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని రామ్ మాథవ్ వంటి కేంద్ర నాయకుడే స్పష్టం చేసినప్పుడు , బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నాలు సాగిస్తోందన్నదానిలో ఎంతవరకూ నిజం ఉంది. బహుశా ఆర్ కె తన రాజకీయ బాస్ లను సంతృప్తి పర్చడం కోసం బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం జగన్ ను సిబిఐ కేసులు చూపి ఒత్తిడి తెస్తోందని ఆర్ కె భావించి ఉండవచ్చు. రాష్ట్రంలో వైసీపీ తిరుగులేని శక్తి కావడం తెలుగుదేశానికి ముప్పుగా పరిణమించింది. ఇందుకోసం బీజేపీ ఎదిగేందుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశం మాట ఎలా ఉన్నా బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ బూచి చూపి ఎదిగేందుకు అవకాశం లేదని గుర్తెరగాలి. ముఖ్యంగా, మూడు రాజధానుల ప్రతిపాదనకూ, ప్రత్యేక హోదా సాధనకూ జగన్ యత్నాలను రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తున్న నేపధ్యంలో అది సాధ్యం కాదని ఆ పార్టీ గ్రహించాలి.
చంద్రబాబునాయుడు సీఈఓ తరహా రాజకీయాలను నడుపుతుండటం వల్ల ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సంబంధాల అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే, ఈవెంట్ మేనేజి మెంటుకు, మార్కెటింగ్ కంపెనీల తరహా పద్దతులను అనుసరిస్తున్నాయి. అయితే, జగన్ అమరావతిపై ప్రజల భ్రమలను ఇప్పటికే తొలగించారు. వాస్తవాన్ని జనం తెలుసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల వారూ వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతవరకూ విస్మరించబడిన ప్రాంతాలు, వర్గాల అభివృద్ది కోసం జగన్ తీసుకుంటున్న చర్యలను వారు స్వాగతిస్తున్నారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం రాజకీయ దృక్పథాన్ని మార్చి వేసింది చంద్రబాబు హయాంలో పెరిగిన కులాలు, ప్రాంతీయ దురభిమానాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన వేదికపైకి వచ్చాయి. రాయలసీమలో నాయకులు తమ ప్రతిపత్తి కోసం ముందుకొస్తున్నారు. వారు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల సూచనతో ఏకీభవిస్తున్నారు. మూడు రాజదానుల ప్రతిపాదనను ఆయన అమలు జేయకపోయినా, లేక ఆయన విఫలమైనా, ప్రాంతీయ అసమానతలు మళ్ళీ తెరమీదికి రావచ్చు బహుశా బీజేపీ తన వ్యూహాన్ని ఈ మార్గంలో ఎంచుకోవచ్చు, ఆర్ కె సూచించిన దొడ్డి దారి పద్దతిలో కాకుండా ఈ మాదిరిగా వ్యూహం పన్నుతూ ఉండవచ్చు.
జగన్ ను పడగొట్టాలన్న యత్నాలు ప్రారంభం కావాలంటే ముందుగా మూడు రాజధానుల ప్రతిపాదనకు విముఖులెవరో తేలాలి., అన్నా డిఎంకెలో పన్నీర్ సెల్వం మాదిరిగా వైసీపీలో అసమ్మతులెవరో తేలాలి., జగన్ కేసులు ఇంకా విచారణ పూర్తి కాలేదు., ఆయన బెయిల్ పై ఉన్నారు. అందువల్ల పాత పద్దతిలో సీబీఐ కేసులను బూచిగా చూపించి జగన్ ను కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నది పసలేని ఊహాగానమే. ఇలాంటి రాతలు రాసిన ఆర్ కె ఊహాగానాలను బీజేపీ సీరియస్ గా తీసుకోవల్సిన సమయం వచ్చింది.
-శ్యామ్