తిరుమల,జూలై 9 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా కాంగ్రెస్లోకి వెళ్లారని విమిర్శించారు. తన పార్టీకి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు గానీ తన గురించి మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయంలో ఎదగాలంటే ఆ పార్టీ సిద్దాంతాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. బీజేపీ నాయకులు కూడా రోజా ఇంట్లో జగన్, కేసీఆర్ ఒప్పాందాలు కుదుర్చుకున్నారని మాట్లాడడం చాలా బాధాకరమని రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె డియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు.
రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే అంటూ ఆమె నిప్పులు చెరిగారు. రాజశేఖర్రెడ్డి పాలన అంటే రైతురాజ్యంగా పేరు పొందిందన్నారు. సీఎం జగన్ కూడా రైతు రాజ్యంగా పాలన సాగిస్తున్నారని రోజా అన్నారు. సీఎం వైఎస్ జగన్ రూ.83 వేల కోట్లను వివిధ పథకాల ద్వారా రైతులకి అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జల వివాదాలే లేవని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండాల్సింది పోయి, దొంగల్లా పారిపోయి వచ్చి, విజయవాడ నడిరోడ్డులో వదిలేసింది చంద్రబాబు కాదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, అందుకే కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. రాష్ట్ర విభజన హక్కులు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు.