ముఖ్యమంత్రి కెసిఆర్కు తమ పొలంలో పండించిన అల్లంను సంగారెడ్డి జిల్లా రేంజల్ రైతులు అందించారు. శుక్రవారం రైతులు నాగేశ్వరరెడ్డి, వెంకట్రామ్రెడ్డి.. జిల్లా హార్టికల్చర్ అధికారి సునీతతో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రానికి వెళ్లి తాము పండిస్తున్న అల్లంను సీఎంకు అందించారు. అల్లం సాగులో ఎలాంటి పద్దతులు పాటిస్తున్నారు? ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? ఆలుగడ్డ విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అల్లం, ఆలుగడ్డ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? అంటూ సిఎం కెసిఆర్ వారిని అడిగి పలు విషయాలు తెలుసుకొన్నారు.
అల్లంకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు పండిస్తున్నారని రైతులను సీఎం అభినందించారు. చాలా చోట్ల రైతులు ఎప్పుడు వేసే వరి, మక్క, పత్తి పంటలనే సాగు చేస్తుండగా.. రు మాత్రం వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. అల్లం, ఆలుగడ్డ సాగు విస్తీర్ణం పెంచాలని, సాగులో ఆదర్శంగా నిలవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా అల్లం, ఆలుగడ్డ, పసుపు సాగవుతున్నదని, దాదాపు 5,500 ఎకరాల్లో అల్లం, 4 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతుందని జిల్లా హార్టికల్చర్ అధికారి సునీత.. ముఖ్యమంత్రికి వివరించారు. జహీరాబాద్ ప్రాంతానికి కూడా కాళేశ్వరం జలాలు అందిస్తామని ఈ సందర్భంగా రైతులకు సీఎం కేసీఆర్ హా ఇచ్చారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని తరలించి లిప్ట్ల ద్వారా జహీరాబాద్ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని తెలిపారు. రాత్రి వరకు పంటల సాగుపైనే రంజోల్ రైతులతో సీఎం కేసీఆర్ చర్చిస్తూ గడిపారు.