భద్రాచలం, మార్చి 02(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 2వ తేది నుండి 16వ తేది వరకు అతివైభవంగా జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ తేదీన జరిగే శ్రీస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం మరియు 11వ తేదీన జరిగే శ్రీస్వామివారి పట్టాభిషేకం వీక్షించే భక్తుల కోసం ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే విధంగా సిద్ధం చేసినట్లు దిల్లీ వెళ్ళిన దేవస్థానం ఈఓ శివాజీ తెలిపారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి రూ. 7,500, 2500, 2000, 1000, 300, 150 విలువ గల సెక్టార్ టిక్కెట్లు మరియు మహాపట్టాభిషేకానికి 1000 రూపాయలు విలువ గల సెక్టార్ టికెట్లను మార్చి 3వ తేదీ గురువారం నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆసక్తిగల భక్తులు శ్రీస్వామివారి కల్యాణానికి, పట్టాభిషేకానికి టికెట్లను వెబ్సైట్ www.bhadrachalamonline.com ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే రూ. 7500 శ్రీరామనవమి కల్యాణ ఉభయ టికెట్ కార్యాలయం నందు ఆలయ టికెట్ కౌంటర్ నందు కూడ విక్రయించబడుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 08743232428 కార్యాలయం పనివేళలో సంప్రదించలరని కోరారు.