- యాదాద్రి పరువు హత్య కేసులో రామకృష్ణ భార్య తీవ్ర ఆరోపణలు
- రామకృష్ణది పరువు హత్యకానద్న సిఐ
ప్రజాతంత్ర, యాదాద్రి, ఏప్రిల్ 18 : యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితో ఉండగానే మట్టిలో పూడ్చారని రామకృష్ణ భార్య వెల్లడించింది. తన తండ్రి ఆస్తి కోసం తాము ఏనాడూ ఆశపడ లేదని ఆమె తెలిపింది. అయితే కేవలం కూతురు కులాంతర వివాహం చేసుకుందని..కక్షతో సుపారీ ఇచ్చి హత్య చేయించారని రామకృష్ణ సోదరుడు రమేష్ వెల్లడించారు. హంతకుడు వెంకటేశంను ఉరి తీయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే రామకృష్ణది పరువుహత్య కాదని..ఆస్తి తగాదాలు మాత్రమేనని భువనగిరి సీఐ సత్యనారాయణ తెలిపారు.
తనకు ఆస్తి ఇవ్వాలని వెంకటేశంను రామకృష్ణ బెదిరించాడని వెల్లడించారు. ఆస్తి పోతుందనే భయంతోనే హత్యకు వెంకటేశం కుట్ర పన్నాడని తెలిపారు. లతీఫ్తో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారని భువనగిరి సీఐ సత్యనారాయణ తెలిపారు. కాగా..తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్నందుకు, తీవ్రమైన పగ పెంచుకున్న యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన వీఆర్వో పల్లెర్ల వెంకటేశం.. రామకృష్ణను దారుణంగా హత్య చేయించినట్టు ఇప్పటి వరకూ జరిగిన పోలీసుల విచారణలో స్పష్టమైంది.