- ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నది
- ఉప ఎననికల కోసమైనా నిరుద్యోగ భృతి ఇవ్వండి
- ఎమ్మెల్యేల్లారా.. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి
- హుజూరాబాద్లో జరిగబోయేది ధర్మయుద్ధమే
- ప్రలోభాలు, బ్లాక్మెయిలింగ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
- రెండో రోజూ ఇల్లంతకుంటలో పర్యటించిన మాజీ మంత్రి రాజేందర్
తాను టిఆర్ఎస్ నుంచి తప్పుకోలేదని కుట్రపూరితంగా తనను బయటకు పంపేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన తనలాంటి వారికి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమైనా నిరుద్యోగ భృతి ప్రకటించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. మంగళవారం నుంచి సొంత నియోజకవర్గమైన కమలాపూర్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా బుధవారం ఇల్లంతకుంటకు చేరుకుని స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో స్వామి వారిని దర్శించు కున్నారు. అనంతరం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యేగా 17 నుంచి 18 సంవత్సరాల పాటు ఉంటూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాను. పార్టీకి రాజీనామా చేసి వొచ్చిన తర్వాత.. నా రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ మళ్లీ వొస్తాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఫించన్లు ఆగిపోయాయని..ఈ ఎన్నికల వల్లనైనా వొస్తాయని సంబురపడుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నవాళ్లకు కూడా వోట్ల కోసం కొత్త కార్డులిస్తారని అంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డులు, ఫించన్లకు దరఖాస్తులకు వెంటనే తీసుకోవాలి. గతంలో ఇచ్చిన హామీ మేరకు 58 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఫించన్ రిలీజ్ చేయాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
హుజురాబాద్ ఎన్నికల వోట్లకోసమైనా రిలీజ్ చేయండి. హుజురాబాద్ను జిల్లా చేయడంతో పాటు.. వావిలాల, చల్లూరును మండలాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. గ్రామాల్లో, మండలాల్లో నిధులు లేక మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిర్వీర్యమయ్యాయి. ఒక్కో మండలానికి పది కోట్లు, ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల నిధులు ఇవ్వాలి. గతంలో అన్ని పంచాయితీలు, మండల పరిషత్తులు, జెడ్పీటీసీలు గెలిపించుకున్నాం. భార్యాభర్తలను, పిల్లలను విడదీసినట్లు… మా నాయకులను, కార్యకర్తలను వేరుచేస్తున్నారు. ఇది నీచమైన చర్య. ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తున్నది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు కొత్తగూడెం నుంచి వికారాబాద్ వరకు ఈటల నియోజకవర్గంపై మిడతల దండులాగా దాడి చేస్తున్నారు. వర్ధన్నపేట, పరకాల, ఇతర ఎమ్మెల్యేలకు ప్రజలు వోట్లేసింది మా నియోజకవర్గం మీద దాడి చేసేందుకు కాదు. రాజభక్తిని చాటుకోవాలంటే చాటుకోండి. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి. కానీ నామీద మీ ప్రతాపం చూపాలని చూస్తే.. అంతకంటే ఎక్కువగా స్పందిస్తానని హెచ్చరించారు. 2008లో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 అసెంబ్లీ సీట్లు గెలిస్తే అందులో నేను కూడా ఉన్నాను. 2009లో 50 సీట్లలో పోటీ చేస్తే 10 మాత్రమే గెలిచారు.
అందులో హుజురాబాద్ కూడా ఒకటి. ఎవరి ఇమేజ్తోనో, ట్రెండ్తోనే గెలవలేదు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ఓడినా…అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా హుజురాబాద్ నుంచి 50 వేల మెజార్టీ ఇచ్చిన ఘనత ఇక్కడి వాళ్లది. ప్రజలు, మేము ఒకరికొకరు అల్లుకుని ఉన్నాం. పచ్చని సంసారంలో చిచ్చుబెట్టాలని ప్రయత్నిస్తే ఖబడ్తార్. నేను పార్టీ పెడుతున్నానని, వేరే పార్టీకి వెళ్తున్నాని ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారలేదు.మీరే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు. ప్రాణముండగా నన్ను బొందపెట్టాలని చూశారు. ఆ బొందలో మీరే పడుతారు. ప్రలోభాలు పెట్టి నేను ఏనాడు గెలవలేదు. మీ ప్రలోభాలు మా ప్రజలు చూస్తున్నారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేద్దామనుకుంటే పొరపాటు. మా ఉద్యోగులు మీ ఆటలు సాగనీయరు. పోలీసు స్టేషన్ల్లో అధికార దుర్వినియోగం చేసి మా వాళ్లను వేధించాలని చూస్తున్నారు. పోలీసులకు ఆ ఉద్దేశం లేకున్నా పైవారి ఆదేశాల ప్రకారం మనసు చంపుకుని చేస్తున్నారు. ఈటల గెలవాలని ఉద్యోగులు, పోలీసులు, యువకులు, మేథావులు కోరుకుంటున్నారు. ఈటల గెలవడమంటే తమను తాము గెలిపించుకోవడమనుకుంటున్నరు. నాలాంటోడు మాట్లాడితేనే ఏమేం వొచ్చాయో అందరికీ తెలుసు. ధాన్యం కొనే శక్తి రైసు మిల్లులకు లేదని.. కొనుగోలు కేంద్రాలని పెట్టాలని నేనే డిమాండ్ చేశాను.
కొంత మంది చెంచాగాళ్లు, డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లతోని కరపత్రాలు, పోస్టర్లు అంటించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అలాంటివేవీ నా దగ్గర నడవవు. 2018లో నా ఓటమి కోసం నా ప్రత్యర్థికి డబ్బులిచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను భయపడలేదు. ఏడు నెలల కాలం నన్ను కేబినెట్లోకి తీసుకోకపోయినా భరించాను. నన్ను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ ప్రజలు దాన్ని గమనించారు. హుజురాబాద్లో ధర్మయుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరగబోతున్నది. ధర్మయుద్ధంలో పాండవులు గెలిచినట్లుగా… హుజురాబాద్లో ధర్మమే గెలుస్తుంది. ఎన్నికలు వస్తే ఇంటికో మనిషి నాకు సంఘీభావంగా వస్తారు. ఇతర జిల్లాల నుంచి కూడా నాకు మద్దతుగా ఫోన్లు చేస్తున్నారు. పిడికెడు మంది నాయకులు వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కర్రుకాల్చి ప్రజలు వాత పెట్టడం ఖాయం. దమ్ముంటే ప్రజాస్వామికంగా పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లపాటు ఉద్యమ జెండా ఎత్తి భంగపడి, అవమానాలకు గురైనవారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు హుజూరాబాద్లో జరిగే కురుక్షేత్రానికి తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు టీఆర్ఎస్ అధిష్ఠానానికి తొత్తులుగా, బానిసలుగా మారారని, తనపై అవాకులు, చెవాకులు పేలిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అధిష్ఠానం ఇచ్చిన రాతలను పట్టుకొని తనపై నిందలు వేసి, ప్రజలను అవమానపరిస్తే రాజకీయంగా బొందపెడుతారని అన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడాని, అణిచివేత నుంచి ప్రజలను ముందుకు నడపడానికి హుజూరాబాదే గొప్ప ఉద్యమం క్షేత్రంగా ఉంటుందని, మరో ఉద్యమానికి నాంది పలుకుతుందని చెప్పారు. ఎప్పటికైనా తానే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు అక్రమంగా డబ్బుతో వోటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. డబ్బులతో కొంతమంది నాయకులను కొనుగోలు చేస్తారేమో గానీ, ప్రజలను కొనుగోలు చేయలేరని ఆయన అన్నారు.