మరో పక్షం రోజుల్లో మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర ప్రారంభం కానుండటంతో వేము)వాడ రాజన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఆదివారం ఉదయం నుండి సోమవారం రాత్రి వరకు శ్రీ రాజరాజేశ్వర స్వామిని లక్షకు పైగా భక్తులు దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం,మేన్ రోడ్డు కిక్కిరిసిపోయాయి.ఈ రద్దీని గమనించి,ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు రాజన్నగుడిని తెరిచి ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించడంతో వేలాది భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి,కోడె మొక్కులు చెల్లించుకోవడానికి,శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.
కోడె మొక్కులు చెల్లించి,శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు కనీసం ఐదు గంటల సమయం పట్టింది.దీనితో పిల్లలు,వృద్థులు క్యూలైన్లలో నీరసించి పోయారు.శీఘ్ర దర్శనం చేసుకోవడానికి రూ వంద టికెట్టు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు సైతం కనీసం రెండు గంటల సమయం పట్టింది.ధర్మదర్శనం చేసుకునే భక్తులు కనీసం 8 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.ఈ రద్దీని గమనించి ఆలయంలో లఘుదర్శనాన్ని ఏర్పాటు చేసి శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులను త్వరితగతిన బయటకు పంపించారు.ఈ సీజన్లో ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరిచి భక్తులను బయటకు పంపించడం ఇదే తొలిసారి. శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలను సమర్పించడానికి బారులు తీరారు.దీనితో మేన్ రోడ్డు కిక్కిరిసిపోగా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిరోధించారు.కాగా సోమవారం వేములవాడకు చేరుకున్న వేలాది భక్తులు గదులు దొరకక రోడ్లపైనే మకాం వేశారు. ఈ రద్దీతో దేవస్థానానికి రూ 40 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని సిబ్బంది వెల్లడించారు.
Tags: Rajanna Temple, overflowing,devotees,sri rajarajeshwari swamya