ప్రజాతంత్ర, వరంగల్, మార్చి 9 : వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర పలికింది. ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు లింగంపల్లి రవీందర్ సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్కు తీసుకురాగా ఖరీదు దారులు ఈ ధర నిర్ణయించారు. మార్కెట్ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ మిర్చి ధరలు పైపైకి ఎగబాకుతూ మార్కెట్ చరిత్రను తిరగరాస్తుంది. వారం రోజుల క్రితం క్వింటా రూ.32వేలు పలకగా సోమవారం ఏకంగా రూ.35వేలు పలికి రికార్డు సృష్టించింది.
ఏనుమాముల మార్కెట్లో ఇంత ధర పలకడం ఇదే ప్రథమమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా బుధవారం 41 వేలు పలకడంతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి క్వింటాకు రూ.9,970ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సైతం భారీగా పెరిగింది. క్వింటాకు రూ. 9,970 పలికింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన రైతు హరీష్ ఏడు పత్తి బస్తాలను అమ్మకానికి తీసుకువచ్చాడు. బాలాజీ అడ్తి ద్వారా సిరివల్లి ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు రూ. 9,970చొప్పున కొనుగోలు చేశారు.