25 మంది పోలీస్ ఇన్ఫార్మర్లను హతమార్చినట్లు వెల్లడించిన మావోయిస్టు పార్టీ
మావోయిస్టు పార్టీని రూపుమాపేందుకు రహస్య పోలీస్ ఏజెంట్లను , కోవర్ట్లను ,ఇన్ఫార్మర్లను పసిగట్టి స్పష్టమైన ఆధారాలతో బీజాపూర్ జిల్లాలోని గంగులూరి ఏరియాలో 12 మంది రహస్య ఏజెంట్లను ఐదుగురు కోవర్ట్లను, ఎనిమిది మంది ఇన్ఫార్మర్లను గుర్తించి ప్రజా కోర్టులో శిక్షించటం జరిగిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటి అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం నాడు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన రహస్య పోలీస్ ఏజెంట్లను కోవర్ట్లను మరియు ఇన్ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో , ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవ ఉద్యమాన్ని నిర్మూళించాలని, మోసపు యుద్ద ఎత్తుగడలలో భాగంగా సమాధాన్ యోజనను తయారు చేసారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను మరియు విప్లవ ఉద్యమాన్ని 2022 నాటికి నిర్మూళిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారని లేఖలో తెలిపారు.
వీరి మోసపు ఎత్తుగడలలో భాగంగా బస్తాపోలీస్ ఐజిపి బీజాపూర్ ఎస్పీ, పెద్దఎత్తున బీజాపూర్ జిల్లాలో రహస్య పోలీస్ ఏజెంట్లను కోవర్టులను , ఇన్ఫార్మర్లను తయారు చేసారని వారు బ్యాంకు ఎకౌంట్లలో కూడ నెలనెల జీతాలు జమ చేసేవారని లేఖలో తెలిపారు. ఈ రహస్య ఏజెంట్ల వ్యవస్థను ఛేధించే క్రమంలో గంగులూరి ఏరియాలో పనిచేస్తున్న డివిసి సభ్యుడు బిజ్జాల్ కోవర్ట్గా బహిర్గతం అయ్యాడని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా యువతను, విద్యార్ధులనరు పతకం ప్రకారం పోలీస్ వ్యవస్థ ఇటువంటి బలహీనతలను అంటించి పక్కదారులు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. విప్లవ ఉద్యమంలో కొద్దిమంది వ్యక్తులు బూర్జువా స్వార్ధాన్ని, సామ్రాజ్యవాద విష సంస్కృతిని వంటపట్టించుకుని బలహీనతలతో పతనమవుతున్నామని లేఖలో తెలిపారు. ఇదే అదునుగా పోలీస్ అధికారులు ఇటువంటి వారిని కోవర్టుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీస్ అధికారులు నిర్మాణం చేసిన రహస్య పోలీస్ ఏజెంట్లను కోవర్టులను నిర్మూళించటంతో పోలీస్ అధికారులు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో తెలిపారు. ఇటీవల కాలంలో ఛత్తీస్ఘఢ్ , తెలంగాణ సరిహద్దుల్లో పెద్దఎత్తున తెలంగాణ లోకి మావోయిస్టులు వస్తున్నారని ఐదు రాష్ట్రాల ఇంటిలిజెన్స్ అధికారులు ములుగు జిల్లాలోని వెంకటాపురంలో సమావేశం అయ్యారని లేఖలో తెలిపారు. ఈ ప్రాంత ప్రజల మీద, విప్లవోద్యమం మీద భారీ స్థాయి మారణకాండను అమలు జరిపేందుకు ఈ సమావేశంలో పతకాలు తయారు చేసారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది.