- వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ
- సిఎల్పి నేత భట్టి విక్రమార్క
- సోనియా, రాహుల్కు ఈడి నోటీసులపై మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : హైదరాబాద్లో పబ్లు, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్ లేకపోవడం వలన మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మైనర్లను పబ్లకు ఎలా అనుమతి ఇస్తున్నారని అన్నారు. అలాగే ఎలా మద్యం సరఫరా చేస్తున్నారు? పబ్లపై నియంత్రణ ఎందుకు లేదు? దమ్ముంటే కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించండని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షాలను కట్టడి చేయడం కోసం ఈడీని ఉపయోగిస్తున్నారు. 1978లో ఇందిరాగాంధీ మీద కూడా కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలు తిరగపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. దేశం కోసం అస్తులనే రాసిచ్చిన కుటుంబం సోనియా, రాహుల్ది. అలాంటి వారి మీద కేసు పెడతారా? భయపెట్టి మరోమారు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఈడీ నోటీస్లకు భయపడతారనుకుంటే పొరపాటే. జాగ్రత్త దేశం మొత్తం తిరగ బడుతుందని భట్టి హెచ్చరించారు.