యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : రేపు 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వొస్తున్నారు. ఆమె యాదగిరిగుట్ట వొస్తున్న నేపథ్యంలో..భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. ఇకపోతే 30 రాష్ట్రపతి రాక కారణంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు.
ధర్మదర్శనాలు, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా మధ్యాహ్నం వరకు రద్దు చేస్తున్నామన్నారు. అంతర్గతంగా స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు యథాతథంగా జరుగుతాయన్నారు. రాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యే వరకు ఎలాంటి దర్శనాలు ఉండవన్నారు. మరోవైపు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 4:30 నుంచి 5:15 గంటల వరకు ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై వేడుకలను నిర్వహించారు.