ప్రతీ మనిషి ఇతరులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా జీవించడానికి కొన్ని నియమాలు అవసరం. ప్రతీ కుటుంబం, సమాజం సక్రమమైన పంథాలో నడవాలంటే కొన్ని కట్టుబాట్లు, పెద్దరికం అవసరం. అలాగే ఒక దేశం, ఆ దేశం లోని ప్రజలు ఎలాంటి అలజ డులు,అశాంతి లేకుండా జీవించడానికి మంచి పరిపాలనా యంత్రాంగం, అందుకు తగిన వ్యవస్థలు అవసరం.ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వాలు, అవి హద్దుదాటకుండా అదుపులో పెట్టడానికి చట్టబద్ధమైన యంత్రాంగాల ఏర్పాటు తప్పని సరి. వ్యవస్థల నడుమ, ప్రభుత్వాల మధ్య అంతర్గత పోరు లేకుండా సాఫీగా సాగడానికి కొన్ని నిర్దిష్టమైన నియమ నిబంధనల ఏర్పాటు అత్యంత ఆవశ్యకం.అలాంటి నియమ నిబంధనలతోకూడిన ఒక బృహత్తరమైన యంత్రాంగమే రాజ్యాంగం. మనం నిర్ధేశించుకున్న నియమ నిబంధనలను మనమే పాటించక పోతే మందలించి,శిక్షించి దారిలో పెట్టడానికి ఏర్పడిన చట్టబద్దమైన వ్యవస్థలు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు స్వీకరిస్తాయి.జనాభా పరంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండి,ఎన్నో రకాల వైరుధ్యాలు అగుపించే సువిశాలమైన భారత దేశాన్ని సమైక్యంగా ఉంచుతూ,దేశ సార్వ భౌమత్వాన్ని కాపాడేందుకు ఒక పటిష్ఠమైన యంత్రాంగాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం భారతదేశానికొక పటిష్ఠమైన రాజ్యాంగాన్నిరూపొందించడం.రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయలనే డిమాండ్ స్వాతంత్య్రానికి పూర్వం నుంచే పురుడుపోసుకుంది. దేశాన్ని పాలించడానికి, ఒక పటిష్ఠమైన రాజ్యాంగం అవసరమని ఎంతో మంది మేథావులు సూచించిన ఫలితం గానే 1946 డిసెంబర్ 6 వ తేదీన రాజ్యాంగ సభ ఏర్పడింది.రాజ్యాంగ రచనకోసం ఎంతో మంది ప్రముఖులు అవిశ్రాంతంగా కృషిచేశారు.వీరిలో అంబేడ్కర్ పాత్ర అత్యంత కీలక మైనది. బ్రిటన్,అమెరికా,రష్యా,కెనడా,ఐర్లాండ్,జర్మనీ లాంటి సుమారు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి,తీవ్రకసరత్తు జరిపిన రాజ్యాంగపరిషత్ ఆయా దేశాల రాజ్యాంగాలలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
భారత ప్రజల విశాల ప్రయోజనాల కోసం జరిగిన సుదీర్ఘ కసరత్తు ఫలితమే భారత రాజ్యాంగ ఆవిర్భావం.1947 ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్ర సిద్ధించింది. స్వాతంత్య్రానంతరం ఎన్నో కుల,మత,ప్రాంత, భాషా, సంస్కృతులకు సంబంధించి భిన్న వాదనలు, విభిన్న వైరుధ్యాలు గల భారత దేశాన్ని ఏకత్రాటిపై నడిపించడానికి ఒక శక్తివంతమైన రాజ్యాంగం అవసరమని భావించిన పలువురు భారతీయ మేథావుల కృషి రాజ్యాంగ రచనకు దోహదం చేసింది. 165 రోజుల సమావేశాల్లో విస్తృత మేథోమధనం జరిపి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల నిర్విరామ కృషి తర్వాత, 114 రోజుల శ్రమించి, చేతి వ్రాతతో 22 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పు కలిగిన అతి పెద్ద భారత లిఖిత రాజ్యాంగం 1949 నవంబర్ 26 వ తేదీన ఆమోదం పొంది, 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ముసాయిదా ఆమోదం పొందిన నవంబర్ 26 వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 వ తేదీ గణతంత్ర దినోత్సవంగా పరిగణింపబడుతున్నది. హిందీ,ఆంగ్ల భాషల్లో వ్రాయబడ్డ భారత రాజ్యాంగ లిఖిత ప్రతులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సురక్షితంగా ఉంచబడ్డాయి.
మనది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర దేశంగా అవతరించిన భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ,న్యాయవ్యవస్థ భారత దేశాన్ని ముందుకు నడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ పటిష్ఠమైన యంత్రాంగాలు. ఇందులో ఏ వ్యవస్థ పనిచేయక పోయినా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యమనుగడే ప్రశ్నార్థక మౌతుంది. భారత ప్రజాస్వామ్య మనుగడకు ఈ మూడు వ్యవస్థలు మూడు స్థంబాల వంటివి. ‘మీడియా’ నాలుగో స్థంబం లాంటిది. భారత పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు,ప్రాథమిక బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి.భారతదేశంలోని పౌరులకు ద్వంద్వపౌరసత్వం ఉండదు. సమానత్వం,స్వేచ్ఛ,స్వాతంత్య్రం,మత స్వేచ్ఛ, దోపిడీ కి వ్యతిరేకమైన హక్కులు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగపరమైన పరిహారపు హక్కులతో పాటు,ప్రాథమిక విధులు కూడా పౌరులకు ఇవ్వబడ్డాయి. భారత దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు,సమైక్యతకు పాటుపడాలని,దేశ భద్రత విషయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతను విస్మరించరాదని,శాంతి,సామరస్యాలను కాపాడుతూ,శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని, భారత దేశానికి సిరిసంపదలైన నదులు,సరస్సులను కాపాడుతూ,వన్యప్రాణి సంరక్షణకు కృషిచేయాలని,పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి కర్తవ్యమని రాజ్యాంగం నిర్ధేశించింది. జాతీయపతాకాన్ని,జాతీయ గీతాన్ని గౌరవించడమంటే దేశాన్ని గౌరవించడమే నన్న భావన ప్రతీ పౌరుని ప్రాథమిక విధి.
మన రాజ్యాంగం ప్రతీ విషయంలో దేశక్షేమాన్ని,ప్రజల బాగోగులను దృష్టియందుంచుకుని అనేక మైన నియమ నిబంధనలు రూపొందించింది. అయితే ఎంత పకడ్బందీగా రాజ్యాంగ రూపకల్పన జరిగినా రాజ్యాంగాన్ని అమలు పరచడంలో విఫలమైతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. రాజమార్గం ఒకటే అయినా, దొడ్డిదారులు అనేకం ఉంటాయి. అడ్డదారిలో రాజ్యాంగాన్ని నిట్టనిలువునా వంచించే వ్యూహాలను నిలువరించాలి. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినేలా జరిగే వ్యూహరచనలకు స్వస్తి చెప్పాలి. ఇప్పటికే మన రాజ్యాంగానికి ఎన్నో సవరణలు జరిగాయి.కాలానుగుణంగా సవరణలు తప్పని సరి.అయితే రాజకీయ కారణాలతో రాజ్యాంగమౌలిక సూత్రాలకు విఘాతం కలిగించడం తగదు. కేంద్ర,రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావుగా ఉండకపోతే ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ పరిహాస ప్రాయంగా మారుతుంది.ఎన్నికల్లో అంగబలం,అర్ధబలంతో పాటు మద్యం ఏరులై ప్రవహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ధన ప్రభావం వలన ఎంతో మంది అర్హులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అశక్తులుగా మిగిలిపోతున్నారు. కుల,మత,ప్రాంతాలు,భాషా విబేధాలు ఓటర్లను శాసిస్తున్నాయి.
ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. ఎన్నికల సంఘం ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్టవేయాలి. టి.ఎన్.శేషన్ లా ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. ప్రజాస్వామ్యం పరిహాసప్రాయం గా మారితే ఆ తప్పు రాజ్యాంగానిదా? ప్రజలదా? పాలకులదా? ఎవరిది? రాజ్యాంగం వలన ఏర్పడిన వ్యవస్థలు విధ్వంసమైతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు. ప్రజల నిర్ణయమే శిరోధార్యం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మన కోసం మనం రూపొందించుకున్న నియమాలను పాటించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం లో సవరణలు అవసరమే. అయితే ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా కాకుండా ప్రజామోదం తో సవరణలు జరగాలి. జనవరి 26 వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ మౌలిక సూత్రాలపై విద్యార్థులకు,యువతకు, సామాన్య ప్రజలకు కనీస అవగాహన కలిగించడానికి ఉపకరించాలి.