- కొరోనా దెబ్బతో యాతన పడుతున్న స్త్రీలు
- సిబ్బంది కొరతతో పరీక్షలకు నిరీక్షణ
ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవం చేయించుకునే వారికి కొరోనా కష్టాలు తప్పడం లేదు. నగదు పురస్కారంతో పాటు సీఎం కేసీఆర్ పేరుతో రూపొందించిన కిట్టు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా
ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి జాడ కానరావడం లేదు. ఇటీవల ప్రభుత్వ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చే గర్భిణుల సంఖ్య, ప్రసవాల సంఖ్య పెరిగింది. వీరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా కొరోనా కారణంగా మహిళల్లో కూడా ఆందోళన కలుగుతోంది. ఎక్కడ హాస్పిటల్కి వెళితే తమకు వైరస్ సోకుతుందో అన్న భయం వారిని వెన్నాడుతోంది. అయితే హాస్పిటల్లో రక్షపరీక్షలు చేయించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కో జిల్లా హాస్పిటల్కి నిత్యం 80 నుంచి 100 మంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. వీరిలో 90 శాతం గర్భిణులకు రక్త పరీక్షలు అవసరమని వైద్యులు అంటున్నారు. రక్తపరీక్షల వార్డు విభాగానికి వెళ్లిన గర్భిణులకు నరక యాతన తప్పడం లేదు.
జిల్లా కేంద్రాసుపత్రిలో రక్త పరీక్షలు పెద్ద పరీక్షగానే మారాయి. చిన్నపాటి రక్త పరీక్షల ఫలితానికి కూడా మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. మరికొన్ని రకాల పరీక్షలకు ఫలితం రావడానికి వారం పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఈ లోపు బాధితులకు రోగం రెట్టింపు కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పరీక్షలు చేసి ఫలితాలు ఇవ్వడానికి కొన్నింటికి గంటల సమయం, మరి కొన్నింటికి రోజు వరకు పడుతోంది. సిబ్బంది కొరత కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రక్త పరీక్షల ఫలితం అందే సరికి రోజులు గడుస్తున్నాయి. కొంత మంది గర్భిణులు నెలలో రెండు సార్లు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇచ్చిన రక్త పరీక్ష ఫెలితం రెండోసారి చికిత్స కోసం వచ్చినప్పుడు తీసుకుని వైద్యుల వద్దకు వెళ్తున్నారు. దీంతో బిడ్డ ఎదుగుదలకు తీసుకోవాల్సిన ఆహారం, మందులు వంటి జాగ్రత్తల్లో వ్యత్యాసం వస్తోంది. ఆసుపత్రిలో మైక్రోబయాలజీ పరికరాలు అందుబాటులో ఉన్నా రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు సరిగా చేయడం లేదు. ఇవి చేస్తే రోగులకు వచ్చిన వ్యాధికి ఎలాంటి మందు వేయాలి, యాంటీబయాటిక్స్ మాత్రలు వాడడం వల్ల ఎన్ని రోజుల్లో వ్యాధి తగ్గుతుంది అనే విషయాలు తెలుస్తాయి. కానీ కొరోనా కష్టాలతో ఇప్పడు గర్భిణులకు సమస్యలు తప్పడం లేదు.