‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్ పొల్యుషన్ పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్ ల మోతమోగుతోంది.. తీన్ మార్ డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్..శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు ఇతర జలచరాలకు ప్రాణ హానిగా మారిన పిఓపి పై చైతన్యమైన యువత శబ్దకాలుష్యపు హానిపై కళ్ళు తెరవలేకపోతోంది.. అధిక డెసిబిల్స్ తో కూడిన శబ్దం సునితమైన చెవిపొరలను దెబ్బతీయటమేకాదు హృద్రోగులు వృద్దుల ఆరోగ్యాలకు చేటు తెస్తుందని పక్షులు కీటకాలను భయకంపితం చేస్తుందన్న వాస్తవం గ్రహించలేకపోతున్నారు..’’
ప్రమాదం శబ్ద ఉత్పాదకమే కానీ..ప్రతి ప్రమాదం శబ్ద విస్ఫోటనం కాదు.. రక్తం గాయానికి చిహ్నం గాయం ప్రమాద నిదర్శణం..కానీ కొన్ని ప్రమాదాలు నిశ్శబ్దగాయలు..అవి బతుకంతా నిశ్శబ్దం ఆవరిస్తాయ్.. ప్రమాదానికి గురైనట్టు తెలిసే సరికే గాయపడినట్టు గుర్తించే లోపే శబ్ద మాధుర్యం అలిగి వెళ్ళిపోతుంది..ఇక ఎప్పటికీ తిరిగిరాని వీడ్కోలిస్తుంది..నిన్ను నిశ్శబ్దంగా గాయపరిచి వినికిడి చంపేసిన హంతక డెసిబిల్స్ కత్తులెవరివని గుర్తుపడతావ్.. ఎవరిపై పిర్యాదు చేస్తావ్..?
మట్టిలో వానపాము అరుపునూ చీమ వినగలుగుతుంది.. చెవులు లేకున్నా చేప శబ్దాన్ని పసిగట్ట గలుగుతుంది..ఆ వినికిడి మాధుర్యాన్ని మహద్భాగ్యాన్ని మనం మనకు తెలియకుండానే కోల్పోతున్నాం..
జీవ పరిణామంలో మనిషికి తోక అంతరించిందని సైన్సు పాఠాల్లో చదువుకున్నాం.. ఆధునిక మానవుడికి రాబోయే దశకాల్లో బాహ్య చెవులు అంతరించిపోయే ప్రమాదముంది.. హెడ్ ఫోన్ లకు అలవాటు పడిన చెవులకు సాధారణ శబ్ద ద్వని వినపడదు .. ఇరువైపులా ఎలాగూ హెడ్ ఫోన్ పరికరం ఉంటుంది కదా ఇక బాహ్య చెవులతో పనేం ఉంది.. పిలిచినా మటాడినా ఒకరికొరికి వినపడదు అయితే సంజ్ నలు లేదంటే సెల్ ఫోన్ లో కాల్ చేసి హెడ్ ఫోన్ లో వినటమే…ఇది రాబోయే తరాలభవిష్యత్ దృశ్యం..
మనది హిందుత్వ దేశం కదా.. గణపతి ఉత్సవాలు మహా ఘనంగా జరుగుతున్నాయ్.. వీధికి రెండు మూడు వేదికలు దేశ వ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు కొలువుతీరి పూజలందుకుంటున్నాయ్…. డీజీపీ అనురాగ్ శర్మ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు ఇతర జిల్లాల్లో 95 వేల విగ్రహాలు ఏర్పాటయ్యాయ్.. అనుమతి పొందని చిన్నాచితకా వేదికలు మరో పదివేల వరకు ఉంటాయ్.. ఒక రాష్ట్రంలోనే లక్ష దాటితే దేశవ్యాప్త విగ్రహాల సంఖ్య ఎంతుంటుందో అంచనా వేయొచ్చు..
ఎకో ఫ్రెండ్లీ నినాదం ఏడాదికేడాది బలపడటంతో గణపతి ఉత్సవాల్లో మట్టి విగ్రహాల వినియోగం అధికమయ్యింది…ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపి) ప్రతిమల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విషయంలో అవగాహన గతం కన్నా హెచ్చించింది.. సంప్రదాయ మట్టి బొమ్మల వాడకం విషయంలో యువత భాగస్వమ్యం అధికం కావటం వల్లే ఈ విప్లవాత్మక మార్పు సంభవించింది…
ఎక్కడైనా ఏ ఉత్సవాల్లోనైనా యువత స్పందనే అధికంగా ఉంటుంది.. యువజనం మమేకంతో ఉత్సవం ఉత్సాహమవుతుంది..ప్రత్యేకించి గణేష్ ఉత్సవాల నిర్వహణలో యువత పాత్రే కీలకం..
ఊర్లలో వినాయక ఉత్సవాల నిర్వహణ కమిటీలు వేయటం..వీధిలో ఒకరిని మించి ఒకరు ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేయటం ఇందుకోసం చందాలు సేకరించటంలో యువత సందడి అంతా ఇంతా కాదు..
ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్ పొల్యుషన్ పై ఇంకా జాగృతం అవటంలేదు..
ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్ ల మోతమోగుతోంది.. తీన్ మార్ డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్..శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతత పారిపోతోంది..
చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు ఇతర జలచరాలకు ప్రాణ హానిగా మారిన పిఓపి పై చైతన్యమైన యువత శబ్దకాలుష్యపు హానిపై కళ్ళు తెరవలేకపోతోంది.. అధిక డెసిబిల్స్ తో కూడిన శబ్దం సునితమైన చెవిపొరలను దెబ్బతీయటమేకాదు హృద్రోగులు, వృద్దుల ఆరోగ్యాలకు చేటు తెస్తుందని పక్షులు కీటకాలను భయకంపితం చేస్తుందన్న వాస్తవం గ్రహించలేకపోతున్నారు..శాస్త్ర వేత్తల పరిశోధనల మేరకు..శబ్ద ధ్వని సెకనుకు 1130 అడుగులు ( గంటకు 770 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది..సాధారణంగా మనం మాట్లాడే సమయంలో శబ్దధ్వని 60 డెసిబిల్స్ గా ఉంటుంది..80 డెసిబిల్స్ దాటే ఏధ్వని అయినా చెవులకు హాని చేస్తుంది..ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు అతిపెద్ద ధ్వనికి గురైతే మన చెవులు వినికిడి శక్తి కోల్పోతాయ్.. వీధుల్లో ఏర్పాటు చేస్తున్న డీజేల్లో ఒక సౌండ్ బాక్స్ నుండే 180 డెసిబిల్స్ శబ్దం విడుదల అవుతుంది..
చెవుల్లో దూర్చుకునే అధిక హెర్ట్ జ్ ల శబ్దం హై వోల్టేజీ ఉల్లాసాన్నిస్తుంది.. ఆ కిక్ శబ్దాన్ని నిశ్శబ్దంగా మారుస్తుంది.. అధిక ధ్వనిని కోరుకొని మౌన శబ్దాన్ని కొనితెచ్చుకోకండి..మితంగా మట్లాడటమే కాదు సమాజ హితంగా వ్యవహరించాలి.. ఒకదేశం అభ్యుదయాన పయనిస్తోందంటే తన దేహంలో యువరక్తం అధికంగా ఉన్నట్టు..పాతకు భిన్నంగా వ్యవహరించటం కొత్తగా ఆలోచించటం కొంగొత్త ఆవిష్కరణలు చేయటం యువతకే సాధ్యం… శబ్దకాలుష్యపై కూడా ప్రకృతి హిత పర్యావరణ సహిత కొత్త సంతకం చేయాల్సిన బాధ్యత ఉంది..చెవి వినికిడికే కాదు శరీరాన్ని బ్యాలెన్స్ గా ఉంచేది కూడా అనవసర రొదతో మన వివేచనను ఇంబ్యాలెన్స్ చేసుకోవద్దు..అధిక శబ్దంపై నిశ్శబ్దం వద్దు..
– కంచర్ల శ్రీనివాస్, 9640311380