రెండు మూడురోజుల్లో సోనియా గాంధీకి నివేదిక
ముగ్గురు ఆశావహుల పేర్లు ఇవ్వనున్న మణికం టాగూర్
ప్రజాతంత్ర, హైదరాబాద్ : తెలంగాణకి కొత్త పీసీసీ ఎవరన్న దానిపై శనివారంతో అభిప్రాయ సేకరణ ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన అభిప్రాయ సేకరణలో 160 మంది అభిప్రాయాలు సేకరించారు. గాంధీ భవన్లో సమావేశాలు ముగించుకుని ఢిల్లీకి వెళ్లారు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మణికం టాగూర్. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ..జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా ఆఖరి రోజు అభిప్రాయ సేకరణకు పిలిచారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు అభిప్రాయాలన్నింటిని క్రోడీకరించి ఆయన నివేదిక సిద్ధం చేసి సోనియా గాంధీకి ఇస్తారు. నివేదికపై సోనియా గాంధీ అధ్యయనం చేసి ముగ్గురు ఆశావహులను ఢిల్లీకి పిలుస్తారని తెలుస్తోంది. ముగ్గురిలో ఒక్కరిని అధికారికంగా ప్రకటించి మిగిలిన ఇద్దరిని నచ్చచెప్పబోతుంది పార్టీ. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇకపై వ్యవహారం అంతా ఢిల్లీకి మారింది. ఒకవైపు టాగూర్ గాంధీ భవన్లో అభిప్రాయ సేకరణ చేస్తుంటే..పార్టీ సీనియర్ నాయకులు సీఎల్పీలో సమావేశం అయ్యారు. సీఎల్పీలో భట్టి..జగ్గారెడ్డి..పొడెం వీరయ్య, శ్రీధర్ బాబు..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు సమావేశం అయ్యారు. పార్టీ పీసీసీ ఎంపికపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
టాగూర్ దగ్గర జరిగిన అభిప్రాయ సేకరణ సోషల్ మీడియాలో ఎలా వొస్తుంది..? ఇది ఓ నాయకుడికి అనుకూలంగా వొస్తోంది అంటే…పార్టీ మీద కుట్ర జరుగుతోందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎల్పీలో సమావేశం ముగిసిన వెంటనే నేరుగా గాంధీ భవన్కి చేరుకున్నారు. టాగూర్తో నేరుగా భేటీ అయ్యారు. బయట జరిగే ప్రచారం తెలియక పోవచ్చు…సోనియాగాంధీకి ఇక్కడి పరిస్థితులు తెలియాలి..? అని ఎమ్మెల్యేలు టాగూర్కి కొన్ని అంశాలు చెప్పారు. పీసీసీ రేసులో ఉన్న ఓ నాయకుడి పేరుని ప్రస్తావించారు. పార్టీ సీనియర్లకు..పార్టీ కోసం కష్టపడే వారికి…పార్టీకి లాయల్గా ఉండే వారికి మాత్రమే పీసీసీ ఇవ్వాలని కోరారు. లేదంటే తాము పార్టీలలో ఉండలేమని చెప్పినట్టు సమాచారం.