పోలీస్ అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి : హోం మంత్రి
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో నకిలీ విత్తనాలను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టడం, ఇతర రాష్ట్రాలనుండి మద్యం అక్రమ రవాణా నిరోధం పై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్స చివాలయంలో శుక్రవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ,డి జి పి అంజనీ కుమార్ తదితర అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతోనూ, పోలీస్ కమిషనర్ల తోను మాట్లాడారు. వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం సేకరించి నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రైతు ప్రయోజన పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయ రుణాల మాఫీ, ఉచిత విధ్యుత్ వంటి పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్న తరుణంలో వారు నకిలీ విత్తనాల విక్రయ దారుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో విజయాలను సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ విషయంలోనూ పోలీసు అధికారులు వ్యవహరించి నకిలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు. అదేవిధంగా, మద్యం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నకిలీ విత్తనాల అమ్మకాలపై 986 కేసులను నమోదు చేశామన్నారు.వీటికి సంబంధించి 1938 నిందితులను అరెస్ట్ చేశామని, 58 మందిపై పి డి ఆక్ట్ నమోదు చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయిదారులపై పి డి ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే వారిని నియంత్రించవచ్చని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిరంతర అప్రమత్తత అవసరం అన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్ల అత్యంత శ్రద్ధ కనపరుస్తుందని ఈ నేపథ్యంలో వారికి నష్టం కలుగజేసే నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కన్నా ప్రస్తుత పరిస్థితిలో మార్పు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై నిఘా ఉంచాలని సూచించారు. అడిషనల్ డిజిపి సంజయ్ కుమార్ జైన్, ఐజిపి షాన్వాజ్ ఖాసిం, ఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.