- ములుగు ఫారెస్ట్ కాలేజీలో మొక్కలు నాటిన సంతోష్
- పర్యావరణదినోత్సవం సందర్బంగా సైక్లింగ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారకర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ శనివారం మొక్కలు నాటారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎంపీ సంతోష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ..రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరూ పెద్ద ఎత్తున మొక్కలను నాటాలన్నారు. అందుకోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాను. పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కృషిని అభినందిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యతను ఇచ్చారు.
ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అధికారులకు అప్పజెప్పారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఫారెస్ట్ కళాశాల, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. దీనిలో అడవుల ప్రాముఖ్యత అడవుల వల్ల కలిగే లాభాల గురించి భవిష్యత్ తెలంగాణ విద్యార్థులకు వివరించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల మొక్కలు, వాటి నుంచి ఉత్పత్తి అయిన ఔషధాలు, జరుగుతున్న పరిశోధనలను ఎంపీ సంతోష్ ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ నవీన్ రావు తన జన్మదినాన్ని పురస్కరిం చుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నుంచి చింతలకుంట వరకు సైక్లింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజక వర్గ పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటాలని, సైకింగ్ చేయాలని ఈ సందర్భంగా ఎమ్మల్యే సుధీర్రెడ్డి పిలుపునిచ్చారు.