Take a fresh look at your lifestyle.

ఆర్‌-5 ‌జోన్‌పై సుప్రీంలో అమరావతి రైతుల పిటిషన్‌

‌ప్రభుత్వ జీఓపై స్టే విధించాలని వినతి
న్యూదిల్లీ,మే6(ఆర్‌ఎన్‌ఎ):  ఆర్‌- 5 ‌జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆర్‌-5 ‌జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుప్రీంను ఆశ్రయించారు. అమరావతి మాస్టర్‌ ‌ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు వాపోయారు. రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రైతులు హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేశారు.

గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను రైతులు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డివైస్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌ధర్మాసన ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

Leave a Reply