నాలుగు భూగర్భ గనుల మైనింగ్ ప్లాన్లకు ఓకే
మరో ఓపెన్ మైనింగ్కూ అనుమతి
సింగరేణి బోర్డు పలు కీలక నిర్ణయాలు
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో చివరిదైన 3వ దశ నిర్మాణం పనుల కాంట్రాక్టుల అప్పగింతకు బోర్డు అనుమతించింది. మూడో దశకు సంబంధించిన 80.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టుల అప్పగింత ప్రతిపాదనలకు బోర్డు అంగీకారం తెలియజేసింది. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింగరేణి కార్మికులకు యూనిఫాం కొనుగోలు, నాలుగు భూగర్భ గనుల మైనింగ్ ప్లాన్లకు, ఒక కొత్త ఓపెన్ కాస్ట్ గనికి అనుమతితో పాటు సింగరేణిలో మూడో దశ సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కాంట్రాక్టులకు బోర్డు అంగీకారం తెలిపింది. కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్ కాస్ట్ గని నిర్మాణానికి, కాసీపేట, ఆర్.కె.-1 ఎ, శ్రీరాంపూర్ 1, శ్రీరాంపూర్ 3, 3ఎ గనుల మైనింగ్ పనులకు బోర్డు అనుమతించింది.
ఈ మూడో దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్ పైన 10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని క్వారీ నీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులతో పాటు కొత్తగూడెం, చెన్నూరులో నేలపై నిర్మించే సోలార్ ప్లాంటు, ఆర్.జి. ఓ.సి.-1, డోర్లీ ఓ.సి.-1 ఓవర్ బర్డెన్ డంపుల వి•ద నిర్మించే సోలార్ ప్లాంటుల నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలను 3 కోట్ల 65 లక్షల రూపాయాలతో యూనిఫాం వస్త్రాన్ని తెలంగాణా రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుండి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. రానున్న రెండేళ్లకు ఓపెన్ కాస్ట్ గనుల్లో వాడే పేలుడు పదార్దాల కొనుగోలుకు, కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్దాల ఉత్పత్తి ప్లాంట్లకు కావాలసిన అమ్మోనియం నైట్రేట్, మొదలగు వాటి కొనుగోలుకు, రూఫ్ బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు తన అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, బలరామ్, డి.సత్యనారాయణ రావు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుండి బొగ్గు శాఖ సహాయ కార్యదర్శులు పి.ఎస్.ఎల్. స్వామి, అజితేష్ కుమార్, నాగపూర్ నుండి వెస్ట్ర కోల్ ఫీల్డస్ ఛైర్మన్ ఆర్.ఆర్.మిశ్రా లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జి.ఎం.కె.రవిశంకర్, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి మురళీధర్ రావులు పాల్గొన్నారు.