Take a fresh look at your lifestyle.

బస్టాండ్లలో తప్పని పడిగాపులు

సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి భంగపాటు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క నానాయాతన పడ్డారు.  మంగళ,బుధవారాల్లో కూడా బస్సుల కోసం వేకువ జామునుంచే బస్టాండ్ల వద్దకు వచ్చినా చేరాల్సిన గమ్యానికి బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు.  తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల రాకతో జూబ్లీ బస్‌స్టేషన్‌,ఇమ్లిబన్‌, ‌దిల్‌సుఖ్‌ ‌నగర్‌,ఉప్పల్‌  ‌బస్టాండ్‌ ‌పరిసరాలు కిటకిటలాడాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా పండుగకు తమ ఊళ్లకు వెళ్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ముందుగా అనుకున్నట్లుగానే రద్దీకి అనుగుణంగా కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, అదిలాబాద్‌, ‌మెదక్‌ ‌సెక్టార్లలోని వివిధ ప్రాంతాలకు రోజువారి సర్వీసులతోపాటు అదనపు బస్సులను ఏర్పాటు చేసినా అవి ప్రయాణికులకు సరిపోవడం లేదు. విజయవాడ వైపు ప్రత్యేక బస్సులు నడిపారు. కర్నూలు రూట్లో కూడా బస్సులు నడిపారు.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్‌,  ‌సీబీఎస్‌లు కిటకిటలాడుడాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ రెగ్యులర్‌ ‌బస్సులతో పాటు యాభై శాతం అదనపు ఛార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు  చేసింది. అన్ని బస్సులు ఎంజీబీఎస్‌ ‌నుంచే నడపడం వల్ల తరచూ ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్టీసీ అధికారులు గత కొన్నేళ్లుగా ఎంజీబీఎస్‌తో పాటు జేబీఎస్‌, ‌నగర శివారు ప్రాంతాలైన దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.‌బి.నగర్‌, ఉప్పల్‌, ఈసీఐఎల్‌, ఆరాంఘర్‌, ‌మెహిదీపట్నంలతో పాటు ఆర్టీసీ అధీకృత ఏజెంట్లకు కేటాయించిన ప్రాంతాల వద్ద నుంచి బస్సులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Leave a Reply