- తాను అనుకూలమే నంటూ ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడి
- సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటు : మంత్రి కెటిఆర్తో ప్రతినిధుల భేటీ
- మంత్రి కెటిఆర్తో డా. నోరి దత్తాత్రేయుడు భేటీ…క్యాన్సర్ చికిత్సలపై చర్చ
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి వి•రేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ప్రజాభిప్రాయాన్ని కోరారు.
కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న అభిప్రాయానికి తాను అంగీకరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రజలంతా ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కంటోన్మెంట్ బోర్డు పాలన సరిగా జరగడంలేదని, ప్రజల అవసరాలు తీర్చడంలేదనే విమర్శలు ఎదుర్కొంటుంది. దీంతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు..కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం విలీనం చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న స్థానికులు తమ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్న నేపథ్యంలో..విలీనం చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై మంత్రి కేటీఆర్ బుధవారం ట్వీట్టర్లో స్థానికుల నుంచి సూచనలు కోరారు.
సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు : మంత్రి కెటిఆర్తో ప్రతినిధుల భేటీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఎఫ్జీవీ కంపెనీ ముందుకు వొచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్తో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి అని కేటీఆర్ సూచించారు. ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ ఆయిల్ ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. దీంతో పాటు వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలలో ఉపాధి లభిస్తుందన్నారు.
మంత్రి కెటిఆర్తో డా. నోరి దత్తాత్రేయుడు భేటీ…క్యాన్సర్ చికిత్సలపై చర్చ
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు..బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలందించిన దత్తాత్రేయను కలవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతులపైన ఇరువురు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల వివరాలను కేటీఆర్ దత్తాత్రేయుడికి అందించారు.
కొరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాదులోనే ప్రారంభమైందని ఇలాంటి రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు.