సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షకాలంలో సీజనల్ వ్యాధులకు ప్రభావితం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జూన్ 1 నుండి 8 వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య నివారణ కారక్రమంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి కలెక్టర్ హసన్పర్తి మండలం గంటూర్పల్లిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలం లో వ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ముఖ్యమన్నారు. గ్రామం మొత్తం వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు. వర్షకాలంలో వచ్చే జ్వరం దగ్గు శ్వాసకోశ వ్యాధుల వలన కరోనా వైరస్ ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవ్వరో వచ్చి చేస్తారని భావించ కుండా తమకు తాము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధులకు దూరంగా ఉంటారని, ఒక ఇంట్లో శుభ్రంగా ఉంటే చాలదని ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉంటనే గ్రామం మొత్తం వ్యాధులకు దూరంగా ఉంటారని ప్రజలు ఈ విషయం లో ముందు జాగ్రత్తల పట్ల అప్రమత్తంగా ఉండక తప్పదని తెలిపారు. కరోనా వైరస్ గ్రామంలో వ్యాప్తి చెందడం లేదనే అపోహలతో ప్రజలు వ్యవహరించవద్దని, ఇంతకు ముందు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో కూడా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వచ్చే వర్షాకాలం జూన్, జూలైలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పదేళ్ల లోపు పిల్లలు 60 యేళ్ల దాటిన వృద్దులు అత్యవసరమైన సందర్భంలోనే బయటికి వెళ్ళాలి తప్ప మిగితా వారు కూడా అవసరం ఉంటేనే బయటి వెళ్లాలని కలెక్టర్ అన్నారు. వచ్చే రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నందున ప్రజలు వైరస్ భారీన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుంటూరుపల్లిలో డంపింగ్ యార్డు, స్మశాన వాటిక కు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. వర్షా కాలంలో దోమల బెడద లేకుండా నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం తో పని చేసి పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరీ రమేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రత్యేక పారిశుధ్య నివారణ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో చేపట్టిన నేపథ్యంలో అందరూ భాగస్వామ్యులుకావలన్నారు. అంతకు ముందు కలెక్టర్ ఎమ్మెల్యే కలిసి రూ.13 లక్షల వ్యయంతో చేపట్టే డంపింగ్ యార్డు, స్మశాన వాటిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సమావేశం లో ఎంపిడివో వీరేశం, తహశీల్దార్ రాజేష్, డివిజన్ పంచాయతీ అధికారి జెడ్పిటిసి సునీత, ఎంపిపి సునీత, సర్పంచ్, ఎంపిటిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.