‘‘నిస్వార్థ ప్రజాసేవకుడిగా ‘లోక్ లెహర్ ఫౌండేషన్’ స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించిన భగవంత్ మాన్ నీటి కాలుష్యంతో అంగవైకల్యం పొందిన పిల్లలకు అమూల్య సేవలు అందిస్తున్నారు. రాజకీయ వేత్త, సామాజిక సేవకుడు, హాస్య నటుడు, సింగర్, సినీ నటుడు అయిన భగవంత్ మాన్ను పంజాబీలు ‘జుగ్నూ’, ‘కామెడీ కింగ్’ లాంటి బిరుదులతో సన్మానించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికల వాగ్దానాలకు కార్యరూపం ఇస్తూనే అంతర్రాష్ట్ర వివాదాలు, ప్రజాభద్రత, ప్రవాసభారతీయులను తమ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడం లాంటి పలు సవాళ్లను అంకితభావంతో అధిగమిస్తూ ‘ఆమ్ ఆద్మీ’ మదిలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని, దేశానికే ఆదర్శవంతమైన సియంగా సుపరిపాలనను సుసాధ్యం చేయాలని కోరుకుందాం, మనసారా ఆశీర్వదిద్దాం.’’
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ భగవంత్ మాన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేబడుతున్న వేళ)
సంచలనాత్మక తీర్పుతో పంజాబీలు అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుకే పట్టం కట్టారు. క్రేజీ కేజ్రీవాల్ నేతృత్వంలో చీపురు పట్టి ఓట్లను ఆమ్ ఆద్మీ వైపుకు ఆసాంతం ఊడ్చేశారు. కాంగ్రేస్ ‘హస్త’వ్యస్థం అయ్యింది. శిరోమణి అకాలీదళం చిరునామా గల్లంతైంది. కమలం వాడి పోయింది. ఢిల్లీ తరహా పాలనకే పంజాబీలు ఫిదా అయ్యారు. కమెడియన్ నటుడైన మిస్టర్ క్లీన్ భగవంత్ మాన్ సియం అభ్యర్థిగా విజయబావుటా ఎగురవేశారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలిచిన ఆమ్ ఆద్మీ ఐదేళ్ల పాలనకు అఖండ ప్రజామోదం లభించింది. నాణ్యమైన ప్రభుత్వ విద్య, డ్రగ్స్ మాఫియా కట్టడి, మహిళా సంక్షేమం, ప్రజావైద్య వసతులు, ఉచిత విద్యుత్తు, గురు గ్రంథ్ సాహిబ్ను అవమానపరిచిన వారిని శిక్షించడం, ఉద్యోగ ఉపాధి కల్పన, రైతు ఆత్మహత్యలను అరికట్టడం, అవినీతిరహిత పాలన లాంటి హామీలను మెచ్చిన పంజాబీలు ‘ఆప్’కే పట్టం కట్టారు. ఈ అపూర్వ విజయంతో ముఖ్యమంత్రిగా నిన్నటి హాస్యనటుడైన 48-ఏండ్ల భగవంత్ మాన్ నేడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు.
హాస్య నటజీవితం :
17 అక్టోబర్ 1973న సిక్కు కుటుంబంలో ‘హర్పాల్ కౌల్-మొహిందర్ సింగ్’ దంపతులకు సటోజ్ గ్రామం, సంగ్రూర్ జిల్లాలో భగవంత్ మాన్ జన్మించారు. ఉన్నత విద్యను ’షహీద్? ఉద్దమ్ సింగ్ ప్రభుత్వ కళాశాల’లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొని హాస్య నటుడిగా గుర్తింపు పొందుతూ బంగారు పతకాలు సాధించారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన అంశాలను తీసుకొని కామెడీ రచనల పంటను పండించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ‘జగ్తార్ జగ్గీ’ హాస్య ఆల్బమ్, టీవీలో ‘జూగ్నూ కెహన్దా హై’ లాంటి పలు కార్యక్రమంతో దశాబ్దకాలం పాటుగా ప్రేక్షకులను అలరించారు. రాణ రణవీర్తో జత కట్టి ‘జుగ్నూ మస్త్ మస్త్’తో టెలీ సీరియల్ నిర్మించారు. కెనడా, ఇంగ్లాండ్లలో పర్యటించి ‘నో లైఫ్ విత్ వైఫ్’ కామెడీ షోతో ఖ్యాతిగాంచారు. 2008లో స్టార్ ప్లస్ నిర్వహించిన ‘ది గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్’ ద్వారా భగవంత్ మాన్ అఖిల భారత ప్రేక్షకులకు దగ్గరైనారు. నేషనల్ ఆవార్డు పొందిన ‘మై మా పంజాబ్ దీ’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ‘జుగ్నూ హాజిర్ హై’ సినిమాలో నటించిన మాన్ మంచి నటుడిగా సుస్థిర స్థానం పొందారు. కామెడీ రచయితగా, వాలీబాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపును పొందిన భగవంత్ మాన్ ప్రముఖ ‘టి-సీరీస్’ సహకారంతో 2013 – 1992 మధ్య 24 హాస్య ఆల్బమ్లు విడుదల చేశారు. దీనితో పాటుగా 4 మ్యూజిక్ ఆల్బమ్ల విడుదల, 13 సినిమాల్లో నటన, 15 వీడియో ఆల్బమ్ల విడుదల లాంటివి చేశారు.
రాజకీయ జీవితం :
2011లో ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్’ పార్టీలో చేరిన భగవంత్ మాన్ రాజకీయ జీవితం ప్రారంభించి 2012లో లెహ్రా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో కేజ్రీవాల్ స్థాపించిన ‘ఆమ్ఆద్మీ పార్టీ’లో చేరి సంగ్రూర్ లోకసభ సభ్యుడిగా పోటీ చేసి నాటి కేంద్ర మంత్రి ‘సుఖదేవ్ సింగ్ దిన్డ్సా’ను 2 లక్షలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జలాలాబాద్? అసెంబ్లీ సీటుకు పోటీ పడి ఓడి పోయారు. ఆల్కహాల్కు బానిసగా మారి పలు విమర్శలు ఎదుర్కొన్న భగవంత్ మాన్ 2019లో మద్యం ముట్టనని ప్రమాణం చేశారు. 16వ లోకసభలో 2014-19 వరకు యంపీగా సేవలు అందించిన భగవంత్ మాన్ 2019లో కూడా సంగ్రూర్ నుంచి యంపీగా ఎన్నికైనారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘ధూరి’ స్థానం నుంచి పోటీ చేసి 58,206 ఓట్ల మెజారిటీతో గెలవడమే కాకుండా ఆప్కు 92/117 సీట్ల అఖండ విజయం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా షహీద్? భగత్ సింగ్ స్వగ్రామం ‘కత్కర్ కలన్’లో ముఖ్యమంత్రిగా మాన్ పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పాలనలో డా: బిఆర్ అంబేడ్కర్, షహీద్? భగత్ సింగ్ పోటీలు కార్యాలయాల్లో తప్పనిసరిగా అలంకరించాలని ప్రకటించారు.
నిస్వార్థ ప్రజాసేవకుడిగా ‘లోక్ లెహర్ ఫౌండేషన్’ స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించిన భగవంత్ మాన్ నీటి కాలుష్యంతో అంగవైకల్యం పొందిన పిల్లలకు అమూల్య సేవలు అందిస్తున్నారు. రాజకీయ వేత్త, సామాజిక సేవకుడు, హాస్య నటుడు, సింగర్, సినీ నటుడు అయిన భగవంత్ మాన్ను పంజాబీలు ‘జుగ్నూ’, ‘కామెడీ కింగ్’ లాంటి బిరుదులతో సన్మానించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికల వాగ్దానాలకు కార్యరూపం ఇస్తూనే అంతర్రాష్ట్ర వివాదాలు, ప్రజాభద్రత, ప్రవాసభారతీయులను తమ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడం లాంటి పలు సవాళ్లను అంకితభావంతో అధిగమిస్తూ ‘ఆమ్ ఆద్మీ’ మదిలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని, దేశానికే ఆదర్శవంతమైన సియంగా సుపరిపాలనను సుసాధ్యం చేయాలని కోరుకుందాం, మనసారా ఆశీర్వదిద్దాం.