- ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నులు అందించాల్సిందే
- కేంద్రానికి మరోమారు స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
ఢిల్లీ రాష్ట్రానికి రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవి•క్షించే వరకు లేదా సవరించే వరకు కచ్చితంగా అమలు చేయవలసిందేనని తెలిపింది. ఢిల్లీకి ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను అందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలోని హాస్పిటల్లకు వచ్చే కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడటంతో…కొరోనాను కట్టడి చేయలేక హాస్పిటల్లు చేతులెత్తేస్తున్నాయి. దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఢిల్లీకి సరఫరా చేయాలని చెప్పినప్పుడు….అంతే పంపాలని, బలవంతపు చర్యలు తీసుకునే పరిస్థితి వైపుకు మమ్మల్ని తీసుకువెళ్లవద్దని కేంద్రాన్ని హెచ్చరించింది.
దేశంలో ఏర్పడ్డ ఆక్సిజన్ కొరతపై సుప్రీంకోర్టు మూడు రోజుల నుండి వరుసగా విచారణ చేపడుతోంది. ప్రతి రాష్ట్ర అవసరాలకనుగుణంగా ఆక్సిజన్ ఆడిట్పై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అత్యున్నత న్యాయ స్థానం తెలిపింది. ఆక్సిజన్ ట్యాంకర్ల ఆటంకం తమ దృష్టికి వచ్చిందని, తామేమీ అందులోకి వెళ్లి చూడమని, తాము వాటికి డ్రైవర్లము కాదని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా విరుచుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేయడం లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. తన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, నిర్బంధం విధించే ఆదేశాలను జారీ చేసే విధంగా తనను ప్రేరేపించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేయాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలను పాటించాలని అధికారులను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కోవిడ్-19 రోగుల్లో కొందరు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు సరిపడినంత ఆక్సిజన్ను సరఫరా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఢిల్లీకి రోజుకు కనీసం 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని ఆదేశించింది. దాచడానికి ఏమీ లేనట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ను రాష్టాల్రకు ఏ విధంగా కేటాయింపులు, పంపిణీ చేస్తోందో పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పింది.