దేశ సరిహద్దు రక్షణలో నిరంతరం అసాధారణ సేవలను అందిస్తున్న భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థాపక దినంగా అక్టోబర్ 08ని పెద్ద ఎత్తున (08 అక్టోబర్ 1932 నుండి) ప్రతియేటా పవిత్రంగా పాటించడం జరుగుతోంది. దేశ సరిహద్దుల్లో భూతల సేనగా ఆర్మీ, గగనతల సేనగా వైమానికదళం మరియు సముద్ర జలాలలపై అజమాయిషీలో నావికాదళం అనితరసాధ్యమైన దేశ భద్రతా విధులను నిర్వహిస్తున్నది. 15 జనవరి రోజున ఇండియన్ ఆర్మీ డే, 04 డిసెంబర్న ఇండియన్ నావీ డే మరియు 07 డిసెంబర్న ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ డేను పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచదేశాల్లో అతి శక్తివంతమైన రక్షణ వ్యవస్థ ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా గుర్తింపు పొందింది. భారత ద్వీపకల్పంలో మూడు వైపుల సముద్రజలాలు, ఉత్తరాన హిమాలయాలు సహజ రక్షణకు ఉపకరించడం మనదేశపు భౌగోళిక అదృష్టం. 1933లో వాయుసేనలో మ్నెదటి యుద్ధవిమానం చేరింది. ప్రప్రధమంగా భారత వాయుసేన వజిరిస్థాన్ పోరుతో ప్రారంభమై 2వ ప్రపంచయుద్ధంలో బర్మాను జపాన్ ఆక్రమించకుండా అడ్డుకొని తన సత్తా చాటడం జరిగింది. దేశ సరిహద్దు గగనసీమలో గస్తీ తిరుగుతూ, ప్రకృతి వైపరీత్యాలలో పౌరుల్ని మరియు ఆస్తులను కాపాడే బాధ్యతలను సమర్థవంతంగా చేపబడుతున్నది.
త్రివిధదళాల్లో సుశిక్షితులైన వైమానికదళం వాయువేగ సేన, ఆయుధసంపత్తి మరియు అపార శక్తియుక్తులను స్వంతం చోసుకుంది. వాయుసేన పాల్గొన్న ముఖ్య యుద్ధాలలో ఇండో-చైనా వార్(1962), ఆపరేషన్ కాక్టస్(1988), ఆపరేషన్ విజయ్(1961, 1999), కార్గిల్ వార్(1999), ఇండో-పాక్ వార్(1947, 1965, 1971, 1999), కాంగో క్రైసిస్(1960-65), ఆపరేషన్ పూమలై(1987), ఆపరేషన్ పవన్(1987), ఆపరేషన్ మేఘదూత్(1984), గోవా దండయాత్ర(1961) లాంటివి ప్రముఖంగా వస్తాయి. ప్రపంచంలో 4వ ఉత్తమ వాయుసేనగా (అమెరికా, రష్యా, చైనా తరువాత) పేరొందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చొరవతో 1948లో ఏర్పడిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్కు అతి పెద్ద ప్రభుత్వ రక్షణ సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ‘‘టచింగ్ ది స్కై విత్ గ్లోరీ’’ అనే నినాదంతో సేవలందిస్తున్న భారత వాయుసేనలో ఏడు కమాండ్స్ ఉన్నాయి. మన వాయుసేనలో ప్రస్తుతం 1,70,000 ఆత్యాధునిక శిక్షణ పొందిన సైనిక మరియు సహాయక సిబ్బంది, 1,500 ఎయిర్ క్రాఫ్టులు ఉన్న ప్రముఖ రక్షణ సంస్థగా కొనియాడబడుతున్నది. మన వాయుసేన జరుపుకునే 88వ వ్యవస్థాపక దినం సందర్భంగా వాయు ప్రదర్శనలు, పరెడ్లు, యువతను రక్షణరంగంలోకి ఆకర్షించడం వంటి పలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. వాయుసేనకు శక్తి నిచ్చిన ఆయుధ సంపత్తిలో మిగ్ విమాన శ్రేణి, సుఖోయ్, హెచ్ఏయల్ తేజాస్, జాగ్వార్, బోయింగ్ 707, హెలికాప్టర్స్, మెసైల్స్ లాంటివి అనేకం ఉన్నాయి.
ఇవే కాకుండా ఇటీవల 36 రాఫెల్ యుద్ధవిమానాలు చేరడం వాయుసేన శక్తిని రెట్టింపు చేసింది. దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్తో నాలుగు మరియు చైనాతో ఒక యుద్ధంలో వైమానికదళం చురుకైన భూమికను నిర్వహించింది. భారత రాష్ట్రపతి సుప్రీం కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్న దేశ వాయుసేన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన అధికారిగా ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నాయకత్వం వహిస్తాడు. మన వాయుసేన 47 వింగ్స్ మరియు 19 ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్లతో సుసంపన్నం అయ్యింది. వాయుసేనలోని ఏడు కమాండ్లలో సెంట్రల్ ఎయిర్ కమాండ్-అలహాబాద్, ఈస్టర్న్ ఎయిర్-షిల్లాంగ్, సదరన్ ఎయిర్-తిరువనంతపురం, సౌత్ వెస్టర్న్-గాంధీనగర్, వెస్టర్న్-న్యూఢిల్లీ, ట్రేనింగ్-బెంగళూరు మరియు మెయిన్టెనెన్స్ కమాండ్-నాగపూర్లలో స్థానీకృతం అయి ఉన్నాయి. హైదరాబాద్?లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ ద్వారా ప్రాధమిక వైమానికదళ శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ లాంటి దేశాల ఎత్తుగడలను చిత్తు చేయడంలో భారత త్రివిధదళాలు, ముఖ్యంగా వాయుసేన మనకు రక్షణ కవచంగా మారి రక్షిస్తున్నది. నేడు ఏ రెండు దేశాల మధ్యలోనైనా యుద్ధాలే జరిగితే వాయు దాడిలే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. మన వైమానికదళంలో విధులు నిర్వహిస్తున్న ధీశాలి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాక్ సైన్యం బంధించినప్పటికీ ధైర్యసాహసాలు ప్రదర్శించడం మనందరం మరిచి పోలేదు. మన వాయుసేన పాక్ భూభాగంలో చాకచక్యంగా విజయవంతంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ మన మదిలో భద్రంగా, తాజాగా ఉంది. అసాధారణ వీరత్వానికి ప్రతీకలైన భారతదేశ త్రివిధదళాలు తమ అపార శక్తియుక్తులతో దేశ భద్రతను కంటికి రెప్పలా కాపాడుతాయనే విశ్వాసాన్ని కలిగి ఉందాం. త్రివిధదళాలను అభినందిద్దాం. జై జవాన్, జైకిసాన్, జై హింద్? అంటూ మనసార నినదిద్దాం.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్ – 99497 00037