- ఇకనుంచి అన్ని శాఖల్లో ఆప్కాస్ ద్వారా నియామకాలు
- ఇఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాల కల్పన
- 47 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ది
- లాంఛనంగా ప్రారంభించిన సిఎం వైఎస్ జగన్
అమరావతి,జులై 3 : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక హాని నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఇప్పటిరకు ఆయా ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇకపై ప్రభుత్వమే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) ద్వారా భర్తీ చేయనుంది. శుక్రవారం తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో ఆప్కాస్ను సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. స్కిల్డ్, సె స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్పవర్ను గుర్తించి వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆప్కాస్లో నియమించబడ్డ వారికి ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 47 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి జరుగనుందని తెలిపారు. ఉద్యోగాల నియమకాల్లో లంచాల మాట ఉండకూడదని అన్నారు. తాను చేపట్టిన పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక సమస్యలను విన్నవించుకున్నారని వివరించారు. ఆప్కాస్ ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం నియమకాలు ఉంటాయని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆప్కాన్ ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ముచ్చటించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడుతూ.. ’పాదయాత్ర సమయంలో ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికీ లంచం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఇదే మాట వినిపించేంది.టీడీపీ హయాంలో అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం వారిని నిలువునా దోచుకుంది. దీనిని రూపుమాపాలని ఆప్కాస్ను రూపొందించాం. అలాగే మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దీనిని అమలు చేస్తాం. కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్కు చైర్మన్గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తాం. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. ఆప్కాస్పై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తీవ్ర దోపిడీకి గురయ్యామని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ భద్రతపై నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, సిఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.